చెన్నై : వాయుకాలుష్యం, శబ్ధకాలుష్యంతో పర్యావరణానికి హాని కలిగించే క్రాకర్స్పై సుప్రీంకోర్టు నియంత్రణలు విధించిన నేపధ్యంలో వ్యాపారులు బాణాసంచా మార్కెట్లలో గ్రీన్ క్రాకర్స్ను ముంచెత్తుతున్నారు. సాధారణ క్రాకర్స్తో పోలిస్తే గ్రీన్ క్రాకర్స్ ధర 30 శాతం అధికమైనా సర్వోన్నత న్యాయస్ధానం మార్గదర్శకాలతో వీటి వైపే మొగ్గుచూపక తప్పడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న క్రాకర్స్లో 70 శాతం గ్రీన్ క్రాకర్స్ క్యాటగిరీకి చెందిన వాటినే విక్రయిస్తున్నారు. ధర ఎక్కువైనా పండుగకు వారం రోజుల ముందు నుంచీ సేల్స్ ఊపందుకుంటాయని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది క్రాకర్స్ సేల్స్ మెరుగ్గా ఉంటాయని మహమ్మారి నేపధ్యంలో లాక్డౌన్లు, నియంత్రణలతో గత రెండేండ్లుగా పండగ కళ తప్పిన క్రమంలో ఈసారి దీపావళి వేడుకలు కళకళలాడతాయని, క్రాకర్స్ సేల్స్ ఊపందుకుంటాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. సాధారణ క్రాకర్స్లో పొటాషియం నైట్రేట్, సల్ఫర్, చార్కోల్ వంటి హానికారక కెమికల్స్ ఉంటాయని దీంతో శబ్ధ కాలుష్యం సైతం తక్కువగా ఉండే గ్రీన్ క్రాకర్స్ వైపు కస్టమర్లు మొగ్గుచూపుతారని ఆశిస్తున్నామని వ్యాపారులు పేర్కొంటున్నారు.ఇక జనం మాత్రం గ్రీన్ క్రాకర్స్ ఖరీదు కావడంతో జేబులు గుల్లవుతాయని ఆందోళన చెందుతున్నారు.