న్యూఢిల్లీ: చిలీలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తున్నది. జన సాంద్రత ఎక్కువగా ఉండే సెంట్రల్ చిలీ చుట్టూ కార్చిచ్చు రగలడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. చిలీ అధ్యక్షుడు గాబ్రియేల్ బొరిక్ శనివారం రాత్రి టీవీలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, సహాయక బృందాలకు సహకరించాలని సూచించారు. ఇళ్లను ఖాళీ చేయాలని అధికారులు చెప్తే, వెంటనే ఖాళీ చేయాలని ప్రజలను కోరారు. కార్చిచ్చు వల్ల దాదాపు 64 మంది మరణించినట్లు చెప్పారు.
వల్పరైసో ప్రాంతంలో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. స్థానిక అధికారులు ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. కార్చిచ్చు రగులుతున్న ప్రాంతాలకు అగ్నిమాపక శకటాలు, అంబులెన్స్లు, అత్యవసర సేవల వాహనాలు చేరుకోవడం చాలా ఇబ్బందిగా ఉందని, ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని కోరారు. విల్లా ఇండిపెండెన్షియా ప్రాంతంలో ఇళ్లు, వ్యాపార సంస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కాలిపోయిన కార్లు వీథుల్లో వరుసగా కనిపిస్తున్నాయి.