Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి షాక్ తగిలింది. కోర్టు నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలివి. ఆగష్టు 28, శుక్రవారం కోల్కతాలో తృణమూల్ ఛాత్ర పరిషత్ (టీఎంసీపీ) ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం జరిగింది. టీఎంసీపీ అంటే టీఎంసీకి చెందిన విద్యార్థి విభాగం.
ఈ కార్యక్రమం నిర్వహించుకునేందుకు కోల్కతా హైకోర్టు పలు సూచనలు, నిబంధనలతో అనుమతించింది. దీని ప్రకారం కోల్కతాలోని క్యాథెడ్రల్ రోడ్డులోని ఒకవైపు మాత్రమే కార్యక్రమం నిర్వహించుకోవాలి. కానీ, రెండోవైపు కూడా నిర్వాహకులు కార్యక్రమం నిర్వహించారు. వాహనాల రాకపోకలకు అడ్డుతగిలారు. ఇదే సమయంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా నేతలు ప్రవర్తించారు. బ్యారికెడ్లు దాటుకుంటూ, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించారు. దీంతో నిర్వాహకులపై హస్టింగ్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
ఇప్పటికే శుక్రవారం టీఎంసీ అగ్రనేత అభిషేక్ బెనర్జీపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తాజాగా టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై బీఎన్ఎస్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎస్ఐ అపు బైద్య ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి మమతా బెనర్జీ హాజరయ్యారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేశారు. కార్యక్రమాన్ని నిర్వహించిన ఇతర నేతలపై కూడా కేసు నమోదైనట్లు తెలుస్తోంది.