భోపాల్ : ఆరోగ్యాన్ని పది కాలాల పాటు పదిలంగా ఉంచుకునేందుకు.. తాజా ఆకుకూరలు, కూరగాయలు తింటుంటాం. మురిగిపోయిన ఆకుకూరలు, కుళ్లిపోయిన కూరగాయలు తింటే అనారోగ్యానికి గురికాక తప్పదు. కాబట్టి వెజిటబుల్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ ఓ కూరగాయల వ్యాపారి మాత్రం నిర్లక్ష్యం వహించాడు. తన వద్ద ఉన్న కొత్తిమీర కట్టలను డ్రైనేజీ వాటర్లో శుభ్రపరిచి విక్రయిస్తున్నాడు. ఈ తతంగం కెమెరా కంటపడింది. ఇంకేముంది ఆ కూరగాయల వ్యాపారిపై కేసు నమోదైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో వెలుగు చూసింది.
కొత్తిమీరను మురుగునీటిలో శుభ్రపరిచిన వీడియోలు భోపాల్ కలెక్టర్కు చేరడంతో ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ వీడియోన కలెక్టర్ అవినాష్ లవనియా తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసి.. చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే కూరగాయల వ్యాపారి ధర్మేంద్ర ఫోన్ నంబర్ దొరికినప్పటికీ, స్విచ్ఛాఫ్గా ఉంది. ధర్మేంద్రను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.