న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎవరికీ ఉపయోగపడని బడ్జెట్ అని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం విమర్శించారు. బడ్జెట్ను బట్టి చూస్తే కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు, ప్రజల సమస్యలు, ప్రజల జీవితాలు, ప్రజల జీవన విధానం, ధనికులు-పేదల మధ్య అసమానతల గురించి ఏమాత్రం పట్టింపు లేదనే విషయం అర్ధమవుతుందని ఆయన విమర్శించారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో నిరుద్యోగం, పేదరికం, అసమానత్వం అనే పదాలను ఎక్కడా ప్రస్తావించలేదని చిదంబరం దుయ్యబట్టారు. ఈ బడ్జెట్తో పేదలకుగానీ, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకుగానీ, ప్రభుత్వానికి పన్నులు కడుతున్న మధ్యతరగతి ప్రజలకుగానీ, గృహిణులకుగానీ ఎలాంటి ఉపయోగం లేదని ఎద్దేవా చేశారు.