Aaditya Thackeray | ప్రతిపాదిత మెట్రో-3 కారు షెడ్ను ఆరె ఫారెస్ట్కు తరలించడానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనకు శివసేన నేత, రాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే సారధ్యం వహించారు. ఇటీవల సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఏక్నాథ్ షిండే.. ముంబై మెట్రో లైన్-3 కార్ షెడ్ను కంజూర్మార్గ్ నుంచి ఆరె ఫారెస్ట్కు తరలించాలని నిర్ణయించారు. దీనికి వ్యతిరేకంగా ఆదివారం స్థానిక ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు సారధ్యం వహించిన ఆదిత్య ఠాక్రే మాట్లాడుతూ.. `ఇది ముంబై కోసం పోరాటం. జీవితం కోసం పోరాటం ( fight for life ), అడవుల కోసం మేం పోరాడతాం. గిరిజనులను రక్షించుకుంటాం. చెట్ల నరికివేతను మేం అంగీకరించం` అని స్పష్టం చేశారు.
`మనకు వ్యతిరేకంగా వారు (మహారాష్ట్ర ప్రభుత్వం) తీసుకున్న నిర్ణయంతో ఆగ్రహం పెల్లుబుకుతుంది. నగర ప్రజలను కాపాడుకోవాలి. అడవులు, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన వల్లే భూతాపం సమస్య తలెత్తింది` అని ఆదిత్య ఠాక్రే పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనకారులు ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. మెగాలోపోలిస్ `గ్రీన్ లంగ్` ముంబై ఆరె ఫారెస్ట్ అని ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు.
2019లో 1800 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆరె ఫారెస్ట్లో ముంబై మెట్రోలైన్-3 కార్ షెడ్ నిర్మాణానికి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)ని అనుమతివ్వాలని ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ కోరింది. కానీ, ఈ ప్రతిపాదనను పర్యావరణ కార్యకర్తలు వ్యతిరేకించడంతో ముంబైలో నిరసనలకు దారి తీసింది.