రాంచీ: జైలుకెళ్లిన వ్యక్తి పదేళ్ల తర్వాత అనూహ్యంగా అనాథ అయిన కుమారుడ్ని కలుసుకున్నాడు (Father And Son Reunite). ఒక ఎన్జీవో సంస్థ ఏర్పాటు చేసిన ఆహార పంపిణీ కార్యక్రమం తండ్రీకుమారులను కలిపింది. సినిమా స్టోరీని తలపించిన ఈ సంఘటన జార్ఖండ్లోని రామ్గఢ్ జిల్లాలో జరిగింది. 2013లో భార్య అనుమానాస్పదంగా మరణించిన కేసులో భర్త టింకూ వర్మను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. దీంతో వారి మూడేళ్ల కుమారుడు శివమ్ అనాథ అయ్యాడు. ఆ బాలుడి ఆలనాపాలనా చూసేందుకు బంధువులు ఎవరూ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో అధికారులు అనాథ బాలుడ్ని రామ్గఢ్లోని డివైన్ ఓంకార్ మిషన్ అనే సేవా సంస్థకు అప్పగించారు.
కాగా, గత పదేళ్లుగా ఆ సేవా సంస్థలో పెరిగిన శివమ్కు ప్రస్తుతం 13 ఏళ్లు. ఆ సంస్థకు చెందిన స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. తనను పెంచి చదివిస్తున్న డివైన్ ఓంకార్ మిషన్ సేవా కార్యక్రమాల్లో అతడు చురుగ్గా పాల్గొంటున్నాడు. రోజు మాదిరిగానే శుక్రవారం ఆ సంస్థ అన్నదాన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా వరుసగా కూర్చొన్న వారికి ఆహారాన్ని శివమ్ వడ్డించాడు. ఆ వరుసలో కూర్చొని గడ్డంతో ఉన్న వ్యక్తి తన తండ్రి మాదిరిగా ఉన్నట్లు గమనించాడు. ఉచిత ఆహారం కోసం వచ్చిన వర్మ కూడా కుమారుడు శివమ్ను గుర్తించాడు. దీంతో 2013లో విడిపోయిన ఆ తండ్రీకుమారులు పదేళ్ల తర్వాత తిరిగి కలుసుకున్నారు.
మరోవైపు జైలు నుంచి విడుదలైన తర్వాత టింకూ వర్మ రామ్గఢ్లోని వికాస్ నగర్ కాలనీలో నివసిస్తున్నాడు. ఆటో నడిపి జీవనం సాగిస్తున్నాడు. మూడేళ్ల వయసులో దూరమైన కుమారుడు శివమ్ను తనకు అప్పగించాలని ఆ ఎన్జీవో సంస్థను కోరాడు. శివమ్ కూడా తన తండ్రితో కలిసి ఉంటానని చెప్పాడు. దీంతో అన్ని ఫార్మాటీలు పూర్తి చేసి శివమ్ను తండ్రి వర్మకు అప్పగించినట్లు ఆ ఎన్జీవో సంస్థ మేనేజర్ రాజేష్ నేగి తెలిపారు.
కాగా, ఆ సేవా సంస్థను వీడుతున్న సందర్భంగా బాలుడు శివమ్ భావోద్వేగానికి గురయ్యాడు. మూడేళ్ల వయసు నుంచి తనను పెంచి ఆలనాపాలనా చూసిన ఆ సంస్థను మిస్ కావడంపై కన్నీరుపెట్టుకున్నాడు. తన తండ్రిని మళ్లీ కలుస్తానని అనుకోలేదని, ఇది నిజంగా దేవుడి మహిమ అని పేర్కొన్నాడు. మరోవైపు గత పదేళ్లుగా కుమారుడు శివమ్ను పెంచడంతోపాటు చదివిస్తున్న ఆ ఎన్జీవో సంస్థకు తండ్రి వర్మ కూడా కృతజ్ఞతలు తెలిపాడు.