Farmers Protest | కేంద్ర వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు ఏడాది కాలంగా నిరసన తెలుపుతున్న అన్నదాతలు తమ ఉద్యమం ఉధృతం చేయనున్నారు. ఇందుకోసం ఈ నెల 29న పార్లమెంట్కు ట్రాక్టర్లతో ర్యాలీ జరుపాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు సంయుక్త కిసాన్ మోర్చా కమిటీ మంగళవారం నిర్ణయం తీసుకున్నది. ఘజీపూర్, టిక్రీ సరిహద్దుల నుంచి రైతులు ట్రాక్టర్లతో పార్లమెంట్కు వెళతారు. మధ్యలో పోలీసులు ఎక్కడ నిలువరిస్తే అక్కడే నిరసనకు దిగుతామని రైతు సంఘాల నేతలు చెప్పారు.
ఈ నెల 26 లోగా వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, లేకపోతే నిరసన ఉధృతం చేస్తామని రైతు సంఘాల నేతలు హెచ్చరించారు. ఈ నెల 22న లక్నోలో మహా పంచాయతీ నిర్వహిస్తామని ప్రకటించారు. లక్నోలో జరిగే మహా పంచాయతీ చరిత్రాత్మక ఘటన కానున్నదని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయిత్ చెప్పారు.