న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ ఘటనలో చనిపోయిన 8 మందిలో నలుగురు రైతుల మరణంపై నిరసనగా ఈ నెల 18న రైల్ రోకోకు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపునిచ్చింది. ఈ ఘటనలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది.
రైతుల నిరసనలో భాగంగా దసరా సందర్భంగా ఈ నెల 15న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టి బొమ్మలను దహనం చేస్తామని రైతు నేత యోగేంద్ర యాదవ్ శనివారం ప్రకటించారు. ‘రైతుల హత్య కుట్రకు పాల్పడిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను ఆ పదవి నుంచి తొలగించి అరెస్ట్ చేయాలి’ అని ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆయన డిమాండ్ చేశారు.
‘దేశవ్యాప్తంగా ఉన్న రైతులు అక్టోబర్ 12న లఖింపూర్ ఖేరి చేరుకుంటారు. పౌర సంస్థలన్నీ రాత్రి 8 గంటలకు (అక్టోబర్ 12న) తమ నగరాల్లో క్యాండిల్ మార్చ్లు చేపట్టాలని మేము అభ్యర్థిస్తున్నాం. జలియన్ వాలా బాగ్ కంటే ఇక్కడ తక్కువ ఏమి జరగలేదు’ అని స్వరాజ్ ఇండియా చీఫ్ యోగేంద్ర యాదవ్ వ్యాఖ్యానించారు. లఖింపూర్ ఖేరిలో మరణించిన రైతుల బూదిదతో రైతులు ప్రతి రాష్ట్రానికి వెళ్లి నిమజ్జనం చేస్తారని ఆయన తెలిపారు.
అక్టోబర్ 15న దసరా రోజున రైతులంతా ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మలను దహనం చేస్తారని చెప్పారు. ‘అక్టోబర్ 18న మేం ‘రైల్ రోకో’ నిర్వహిస్తాం. 26న లక్నోలో భారీ మహాపంచాయత్ ఉంటుంది’ అని యోగేంద్ర యాదవ్ వెల్లడించారు.
కాగా, రైతులను భయపెట్టేందుకే వారిపై దాడి చేసేశారని మరో రైతు నేత దర్శన్ పాల్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా, ఆయన కుమారుడు ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేయాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు మరో రైతు నేత జోగిందర్ సింగ్ ఉగ్రన్ అన్నారు.