Leaders in Farmers protests | వ్యవసాయాన్ని కార్పొరేటీకరించేందుకు కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉధృత ఆందోళన సాగించి విజయం సాధించారు కర్షకులు. ఈ భారీ విజయం సాధించడానికి అన్నదాతల్లో చైతన్యం కలిగించిన వారిలో ఒక డాక్టర్.. మరో రిటైర్డ్ టీచర్.. మాజీ సైనికోద్యోగి.. ఢిల్లీ మాజీ పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు. అన్నదాతలకు సకాలంలో సూచనలు, అవగాహన కల్పిస్తూ.. జాతీయ స్థాయిలో కర్షకుల ఉద్యమానికి ఓ రూపాన్నిచ్చారు.
తత్ఫలితంగా ఏడాదికి పైగా ఉద్యమించిన అన్నదాతలు మరో ఉధ్యత ఆందోళనకు సిద్ధం అవుతున్న వేళ ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం అకస్మికంగా రైతు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. వివాదాస్పద వ్యవసాయ చట్టాలతో వచ్చే కష్ట నష్టాలపై అన్నదాతలకు అవగాహన, చైతన్యం కల్పించిన ఉద్యమానికి ముందు వరుసలో నిలిచిన రైతు నేతలపై ఓ లుక్కేద్దాం..
రాకేశ్ తికాయిత్.. భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి. ఒకనాడు ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్గా పని చేశారు. ఏండ్ల తరబడి బీకేయూ నాయకుడిగా అన్నదాతలకు అందుబాటులో ఉన్న ఈ రైతు నేత 52 ఏండ్ల పడిలో ఉన్నారు. ఎన్నికల రాజకీయాల్లో ప్రవేశించడానికి ప్రయత్నించారు. వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చల్లో కీలక భూమిక పోషించారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్లో అన్నదాతల ఉద్యమానికి సారధ్యం వహించడంతో జాతీయ దృష్టిని ఆకర్షించారు. రిపబ్లిక్ డే నాడు ఢిల్లీలో జరిగిన హింస పట్ల భావోద్వేగానికి గురయ్యారు. కన్నీటి పర్యంతం కావడంతోపాటు నిరసనలకు నవశక్తి కల్పించారు.
దర్శన్పాల్.. అఖిలభారత కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ సభ్యుడు. వృత్తిరీత్యా ఎంబీబీఎస్ డాక్టర్. 70 ఏండ్ల వయస్సులోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో వ్యవసాయ చట్టాలపై చర్చించడంలో చాలా చురుగ్గా వ్యవహరించారు. రైతు సంఘాలన్నింటిని ఏకం చేయడంలో వాటి మధ్య సమన్వయకర్త పాత్ర పోషించడంలో కీలకంగా ఉన్నారు. పంజాబ్ బయట ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రల్లో రైతులను ఆందోళన బాట పట్టించడంలో ముఖ్య భూమిక పోషించారు.
జోగిందర్ సింగ్ ఉగ్రహన్ (బీకేయూ-ఉగ్రహన్).. మాజీ సైనికోద్యోగి. సునం రైతు కుటుంబానికి చెందిన జోగిందర్ సింగ్ ఉగ్రహన్.. ప్రజాదరణ పొందిన రైతు నేతల్లో ఒకరు. పంజాబ్లో దూకుడు వ్యూహాలతో ఆందోళన చేపట్టడంలో ముందు వరుసలో నిలిచారు. రైల్ రోకోతోపాటు బీజేపీ నేతల ఘెరావ్లో దూకుడుగా వ్యవహరించారు. ఢిల్లీలోని సింఘూ సరిహద్దు వద్దే మెజారిటీ రైతు సంఘాలు ఆందోళన చేస్తుంటే.. టిక్రీ సరిహద్దు వద్ద అంతా తానొక్కరై ఆందోళనా కార్యక్రమాలను ముందుకు నడిపారు.
బల్బీర్సింగ్ రాజేవాల్.. బీకేయూ ప్రెసిడెంట్. 78 ఏండ్ల వయస్సులోనూ కేంద్ర మంత్రుల వద్ద రైతుల వైఖరిని స్పష్టంగా చెప్పగల చాతుర్యం గల నేత. 31 రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు, ఆందోళనలకు ప్రణాళిక రూపకల్పన అమలు వ్యూహాల రూపకల్పనలోనే ప్రధాన నేత. నిరసనకారుల డిమాండ్ల చార్టర్ రూపకల్పన వెనుక బల్బీర్సింగ్ రాజేవాల్ ఉన్నారు.
హనన్మొల్లా.. అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి. 75 ఏండ్ల వయస్సులోనూ వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాలని నిరంతరం వాణి వినిపించిన నేత. పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా వివాదాస్పద చట్టాల ఉపసంహరణ జరిగే వరకు ఆందోళన కొనసాగించాలన్నారు. అంతే కాదు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కి చట్టబద్ధత కల్పించాలని, పోరాటంతోనే ఈ లక్ష్యాన్ని చేరగలమని కర్షకులకు ఉద్బోధించారు.
గుర్నాం సింగ్ చాదుని.. బీకేయూ హర్యానా అధ్యక్షుడు.. వ్యవసాయ చట్టాలు ఆమోదం పొందకముందే రైతులను సమీకరించి ఆందోళనలు చేయడంలో సఫలీకృతం అయ్యారు. అర్థనగ్న ప్రదర్శనలు.. రాష్ట్ర రహదారులపై బంగాళాదుంపలు విసిరివేసి నిరసన తెలపడం ద్వారా రైతుల దృష్టిని ఆకర్షించారు. కర్నాల్లో బీజేపీ వేడుక వద్ద నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు రైతులు. కానీ హర్యానా సీఎం మనోహర్లాల్ ఖట్టర్ సారధ్యంలోని సర్కార్ వారిపై ఉక్కుపాదం మోపింది. దీంతో పలువురు నేతలు గాయాలపాలయ్యారు.
సుఖ్దేవ్ సింగ్ కోక్రికలాన్.. బీకేయూ ఉగ్రహన్ ప్రధాన కార్యదర్శి.. రిటైర్డ్ స్కూల్ టీచర్. ఢిల్లీ చలో కార్యక్రమంలో పోలీసులతో ముందు వరుసలో తలపడిన నేతల్లో ఒకరు. కేంద్ర ప్రభుత్వం రైతు నేతలతో 11 రౌండ్ల చర్చలు జరిపింది. జనవరి 22న చర్చలకు బ్రేక్ పడింది. కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్ తదితరులు రైతు సంఘాల నేతలతో జరిగిన చర్చల్లో పాల్గొన్నారు.
బీజేపీ పాత మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్.. ఎన్డీఏ నుంచి బయటకు రావడం కూడా వ్యవసాయ చట్టాలపై ప్రతిష్ఠంభన ఏర్పడటానికి కారణం. పార్లమెంట్ వేదికగా అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్.. తాము వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తన భార్య హర్సిమ్రత్ కౌర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తారని తేల్చేశారు. ఆ తర్వాత హర్సిమ్రత్ కౌర్ కేంద్ర క్యాబినెట్ మంత్రి పదవికి రాజీనామా చేశారు.