న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసన ముగిసింది. అయితే సింఘూ, ఘాజీపూర్ సరిహద్దులు మాత్రం జనవరిలోనే తెరుచుకోనున్నాయి. ఈ సరిహద్దుల్లోని జాతీయ రహదారుల్లో ట్రాఫిక్ను కూడా వచ్చే నెల నుంచే పునరుద్ధరించనున్నారు. ఢిల్లీ-ఘాజియాబాద్ను కలిపే ఘాజియాబాద్ జాతీయ రహదారి, ఢిల్లీ-హర్యానాను కలిపే సింఘూ జాతీయ రహదారిపై ట్రాఫిక్ను జనవరి నుంచి అనుమతిస్తామని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) తెలిపింది. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలను రైతులు పూర్తిగా ఖాళీ చేసినప్పటికీ, పోలీసులు ఏర్పాటు చేసిన కాంక్రీట్ బారికేడ్ల తొలగింపు, ఆ ప్రాంతాల క్లీనింగ్కు కొంత సమయం పడుతుందని పేర్కొంది. ఈ పనులు పూర్తైన తర్వాత తనిఖీ చేసిన అనంతరం జాతీయ రహదారుల వినియోగానికి క్లియరెన్స్ ఇస్తామని వెల్లడించింది.
మరోవైపు, మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపైగా ఆందోళన చేసిన ఢిల్లీ శివారు ప్రాంతాలను రైతులు ఖాళీ చేసే ప్రక్రియ బుధవారానికి పూర్తవుతుందని అధికారులు తెలిపారు. అనంతరం సరిహద్దు ప్రాంతాల్లో బారికేడ్ల తొలగింపు, క్లీనింగ్ వంటి చర్యలకు మరో 10-15 రోజుల సమయం పడుతుందని చెప్పారు.