తిరువనంతపురం: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన వ్యక్తి మృతదేహాన్ని తీసుకొనేందుకు అతడి కుటుంబం నిరాకరించింది. అయితే అతడి మృతదేహాన్ని తనకు అప్పగించాలని కోరుతూ స్వలింగ భాగస్వామి కోర్టును ఆశ్రయించాడు. (queer couple) కేరళలోని కోచిలో ఈ సంఘటన జరిగింది. పురుషులైన జెబిన్, మను స్వలింగ వివాహం చేసుకున్నారు. వారిద్దరూ కలిసి ఒక ఇంట్లో జీవిస్తున్నారు. ఫిబ్రవరి 2న మను ఇంటి టెర్రస్ పైనుంచి కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుల తర్వాత మరణించాడు.
కాగా, మను మృతదేహాన్ని తీసుకునేందుకు, ఆసుపత్రి వైద్య ఖర్చులు భరించేందుకు అతడి కుటుంబం నిరాకరించింది. అయితే మను మృతదేహాన్ని జీవిత భాగస్వామి జెబిన్కు అప్పగించేందుకు చట్టపరమైన నిబంధనలు లేవు. దీంతో అతడి మృతదేహం రెండు రోజులుగా ప్రైవేటు ఆసుపత్రిలోని మార్చురీలో ఉంది.
మరోవైపు జెబిన్ కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. తన భాగస్వామి మను మృతదేహాన్ని అప్పగించాలని కోరాడు. కేరళ తొలి లింగమార్పిడి న్యాయవాది పద్మా లక్ష్మి ఆయన తరుపు వాదించింది. స్పందించిన హైకోర్టు ఆ ప్రైవేట్ ఆసుపత్రికి నోటీస్ పంపింది. ఎవరూ తీసుకోని మృతదేహాల కోసం ప్రభుత్వం అనుసరించే విధానాల గురించి వివరణ కోరింది. అలాగే కుటుంబ సభ్యులు తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.
కాగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రక్త సంబంధీకులు లేదా వారసులు మృతదేహాన్ని తీసుకోని పక్షంలో వైద్య పరిశోధనల కోసం ప్రభుత్వ వైద్య కాలేజీలకు అప్పగిస్తారు.