లక్నో : భూ వివాదం ఓ దళిత కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్నది. ఆ ఇంట్లో ఉన్న బాలికపై సామూహిక లైంగికదాడి చేసి గొడ్డలితో నరికేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ప్రయాగ్రాజ్ జిల్లాకు చెందిన ఓ దళిత కుటుంబానికి, అగ్ర కులస్తులకు మధ్య గత రెండు, మూడేండ్ల నుంచి భూ వివాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అగ్ర కులస్తులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దళిత కుటుంబాన్ని రాజీ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ తమకు దక్కాల్సిన భూమి విషయంలో దళిత కుటుంబం పట్టువీడవలేదు. ఈ ఏడాది సెప్టెంబర్లో కూడా పోలీసులు ఎస్సీలను కాంప్రమైజ్ చేసేందుకు యత్నించి విఫలమయ్యారు. అగ్ర కులస్తులపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యాక, సెప్టెంబర్ 21న ఎస్సీ కుటుంబంపై దాడి చేశారు.
మొత్తానికి గురువారం తెల్లవారుజామున ఆ దళిత కుటుంబంపై అగ్ర కులస్తులు గొడ్డళ్లతో దాడి చేశారు. దళిత కుటుంబానికి చెందిన ఇద్దరు దంపతులతో పాటు అమ్మాయి(16), అబ్బాయి(10)ని చంపేశారు. అమ్మాయిని చంపే కంటే ముందు ఆమెపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను పదునైన గొడ్డలితో నరికి చంపారు. తల్లి, తండ్రి, కుమారుడి మృతదేహాలకు దూరంగా కూతురు మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. అగ్ర కులానికి చెందిన 11 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు.