న్యూఢిల్లీ, మే 29: నకిలీ నోట్ల బెడదను తొలగిస్తామని, నల్ల ధనాన్ని బయటకు తెస్తామని గొప్పలు చెప్పుకొంటూ ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2016లో పెద్ద నోట్ల రద్దు చేసింది. కానీ ఆ లక్ష్యాన్ని సాధించడంలో బీజేపీ సర్కారు విఫలమైందని ఆర్బీఐ నివేదిక ద్వారా అర్థమవుతున్నది. పాత నోట్లతో పాటు కొత్తగా ప్రవేశపెట్టిన రూ.500, రూ.2000 నోట్లకు కూడా నకిలీ నోట్లు వచ్చినట్టు పేర్కొన్నది. 2020తో పోల్చితే 500 రూపాయల నకిలీ నోట్లు 102%, 2000 రూపాయల నకిలీ నోట్లు 54.16% పెరిగాయని తెలిపింది. దీనిపై ప్రతిపక్షాలు కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. ‘మోదీగారు నమస్కారం. డీమానిటైజేషన్ గుర్తుందా? నకిలీ నోట్లను తొలగిస్తామన్నారు. ఇప్పుడేమో నకిలీ నోట్లు పెరిగాయని ఆర్బీఐ వెల్లడించింది’ అని టీఎంసీ నేత డెరెక్ ఒబ్రెయిన్ ట్వీట్ చేశారు. ‘నోట్ల రద్దుతో కలిగిన లాభం ఏంటో ఇప్పుడు అర్థం అయింది’ అని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ట్విట్టర్లో ఎద్దేవా చేశారు.