ముంబై : ఇది సభ్య సమాజం తలదించుకునే ఘటన. ఆధునిక ప్రపంచం అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న.. సైన్స్ దినదినాభివృద్ధి చెందుతున్న.. మూఢనమ్మకాలు మాత్రం వెలుగు చూస్తూనే ఉన్నాయి. కన్యత్వ పరీక్షలో విఫలమైందని తన భార్యను ఓ భర్త గెంటేశాడు. ఆమె చెల్లిని కూడా అత్తింటివారు బయటకు పంపించేశారు.
మహారాష్ర్టలోని కొల్హాపూర్కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లకు కంజర్భాట్ కమ్యూనిటీకి చెందిన ఇద్దరు అన్నదమ్ముళ్లకు ఇచ్చి గతేడాది నవంబర్ 27న వివాహం జరిపించారు. వారి తెగ సంప్రదాయం ప్రకారం పెళ్లైన మూడు రోజులకు నూతన వధువులకు కన్యత్వ పరీక్ష నిర్వహించారు. నూతన వధూవరులకు తెల్లటి వస్ర్తాలు ధరింపజేసి తొలిరాత్రిలో కన్యత్వ పరీక్ష చేశారు. అయితే ఇందులో ఓ వధువు కన్యత్వ పరీక్షలో విఫలమైంది. దీంతో ఆమెను పుట్టింటికి పంపించేశారు. ఆమె కన్యత్వ పరీక్షలో విఫలమవడంతో చెల్లిని కూడా ఇంటి నుంచి గెంటేశారు.
తమకు ఆ అమ్మాయిలు వద్దని పెళ్లికుమారుల కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. తమను మోసం చేశారని అందుకు రూ. 10 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో బాధిత యువతుల తల్లిదండ్రులు జాట్ పంచాయతీ పెద్దలకు తమ గోడును వినిపించారు. వారు రూ. 40 వేలకు ఒప్పందం కుదిర్చారు. అంతేకాకుండా ఇద్దరు అన్నదమ్ముళ్లు విడాకులు కూడా ఇస్తారని తెలిపారు. కమ్యూనిటీ నుంచి యువతుల కుటుంబాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
చేసేదేమీ లేక బాధిత యువతుల తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.