స్పెషల్ టాస్క్ బ్యూరో హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టుల వల్ల భూమి కోల్పోయే బాధితులకు నష్టపరిహారంతోపాటు వారి కుటుంబ సభ్యులకు సంబంధిత శాఖలో ఉద్యోగం ఇవ్వటం సహజ న్యాయ సూత్రం. కానీ బీజేపీ సర్కార్ ఈ సహజ న్యాయ సూత్రానికి తిలోదకాలిచ్చింది. రైల్వే ప్రాజెక్టుల వల్ల భూమి కోల్పోయిన వారికి ఇచ్చే ఉద్యోగాలకు స్వస్తి పలికినట్టు ఈ నెల 14న పార్లమెంట్లో రైల్వేశాఖ మంత్రి వైష్ణవ్ ప్రకటించారు. ఈ విధాననిర్ణయాన్ని 2019 నవంబర్లోనే తీసుకొన్నప్పటికీ ఇంతకాలం గోప్యంగా ఉంచారు. ఉద్యోగానికి బదులుగా రూ.5 లక్షల నగదు చెల్లించనున్నట్టు పునరావాస విధానంలో పేర్కొన్నారు.
జర్నలిస్టులకు రాయితీ ఎత్తివేత
రైళ్లలో ప్రయాణించే అక్రెడిటేటెడ్ జర్నలిస్టులకు (ప్రభుత్వం గుర్తించిన) టిక్కెట్లపై 50 శాతం రాయితీ ఉండేది. దీనిని కూడా కరోనా సమయంలో ప్రభుత్వం రద్దు చేసింది. జర్నలిస్టుల సంఘాలు, పార్లమెంటరీ స్టాడింగ్ కమిటీలు సైతం దీనిని పునర్ధురించాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు.
సామాన్య జనానికి తప్పని ఇక్కట్లు
సామాన్య ప్రజలు ప్రయాణించే వందలాది ప్యాసింజర్ రైళ్లను పొదుపు సాకుతో ఇప్పటికే కేంద్రం రద్దు చేసింది. పొదుపుతో సంబంధం లేకపోయినప్పటికీ మరెన్నో ఎక్స్ప్రెస్ రైళ్ల హాల్ట్లను సైతం రద్దు చేసింది. వీటి స్థానంలో సామాన్యుడు భరించలేని ధర ఉండే వందే భారత్, తేజస్, దురంతో రైళ్లను ప్రవేశ పెట్టింది. రైలు ప్రయాణం నుంచి పేదలను దూరం చేసి సంపన్నులకు మాత్రమే రైళ్లను చేరువ చేసే చర్యలను అమలు చేస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కరోనాతో కరువు భత్యానికి మంగళం
కరోనా సాకుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2020 జనవరి నుంచి జూన్ 2021 వరకు చెల్లించాల్సిన కరువు భత్యాన్ని నిలిపివేసింది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఈ బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చింది. తాజాగా దీనిని కూడా ఇవ్వలేమని రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి చావు కబురు చల్లగా తెలిపారు.
సీనియర్ సిటిజన్స్కు రాయితీ రద్దు
రైళ్లలో ప్రయాణించే వయో వృద్ధులకు రాయితీ ఇచ్చే వెసులుబాటు ఎంతోకాలంగా ఉన్నది. కరోనా సాకుతో మార్చి 19, 2020 నుంచి ఈరాయితీని రైల్వే శాఖ రద్దు చేసింది. అంతకు ముందు సినీయర్ సిటిజన్స్కు స్లీపర్ క్లాస్లో టికెట్ ధరపై 54 శాతం, 3 ఏసీలో 16 శాతం, 2 ఏ, చైర్ కార్లో 7 శాతం, ఫస్ట్ క్లాస్ ఏసీలో 2 శాతం రాయితీ ఉండేది.