తిరువనంతపురం : శబరిమలలో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. ఆలయానికి వెళ్లే మార్గంలో ఉన్న పెన్ ఘాట్ వంతెన కింద భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. పెన్ ఘాట్ వంతెన కింద 6 జిలెటిన్ స్టిక్స్ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న బాంబు స్క్వాడ్ సిబ్బంది వంతెన ఏరియాలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది.
మకర సంక్రాంతి పర్వదినాన శబరిమలలో మకరజ్యోతి దర్శనం ఇచ్చిన సంగతి తెలిసిందే. పొన్నంబలమేడు కొండల్లో మకర జ్యోతి కనిపించింది. జ్యోతి దర్శనం కోసం ప్రతి ఏడాది మాదిరిగానే భారీ సంఖ్యలో భక్తులు శబరిమల చేరుకున్నారు. అయ్యప్ప భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. మకర జ్యోతి దర్శనం కాగానే.. శరణు ఘోసతో శబరిమల సన్నిధానం మార్మోగింది. మకర సంక్రాంతి రోజున జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి దర్శనం ఇస్తాడని భక్తులు నమ్ముతారు. దీంతో జ్యోతి దర్శనం ఇవ్వగానే భక్తులు ఆనంద పరవశానికి లోనయ్యారు.