Srinagar | శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్ – బారాముల్లా హైవేపై సోమవారం ఉదయం భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. పేలుడు పదార్థాలను గమనించిన భద్రతా బలగాలు.. ఆ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. తక్షణమే బాంబు డిస్పోజల్ స్క్వాడ్ అక్కడికి చేరుకుని, పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసింది.
పేలుడు పదార్థాలు లభించిన ఏరియాతో పాటు ఆ పరిసరాల్లో భద్రతాల బలగాలు కూంబింగ్ చేపట్టాయి. పట్టణ్ ఏరియాలోని జంగం ఫ్లై ఓవర్పై పేలుడు పదార్థాలు లభ్యమైనట్లు సీఆర్పీఎఫ్ అధికారులు వెల్లడించారు. బారాముల్లా – శ్రీనగర్ హైవే పైనే జంగం ఫ్లై ఓవర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్రధాన రహదారి కావడంతో పోలీసులు అప్రమత్తమై ఇరు వైపులా ట్రాఫిక్ను నిలిపివేశారు. పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసిన అనంతరం వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చారు. అయితే ఈ మార్గంలో ప్రతి రోజు ఉదయం సాధారణంగా ఆర్మీ కాన్వాయ్లు తిరుగుతుంటాయని పోలీసులు తెలిపారు. జవాన్లను లక్ష్యంగా చేసుకుని పేలుడు పదార్థాలను ఫ్లై ఓవర్పై పాతిపెట్టి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.