అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలోని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మరణించగా 15 మంది గాయపడ్డారు. పంచమహల్ జిల్లాలోని ఫ్లోరో కెమికల్స్ ఫ్యాక్టరీలో గురువారం ఉదయం పది గంటలకు భారీ పేలుడు సంభవించింది. ఘోఘంబ తాలూకాలోని రంజిత్నగర్ గ్రామానికి సమీపంలో ఉన్న గుజరాత్ ఫ్లోరోకెమికల్స్ లిమిటెడ్ (జీఎఫ్ఎల్) రసాయన తయారీ కర్మాగారంలో జరిగిన ఈ పేలుడు శబ్దాలు కొన్ని కిలోమీటర్ల వరకు వినిపించినట్లు స్థానికులు తెలిపారు.
కాగా, అగ్నిమాపక శకటాలు వెంటనే సంఘటనా ప్రాంతానికి చేరుకున్నాయని, మంటలు అదుపులోకి వచ్చాయని పంచమమల్ ఎస్పీ లీనా పాటిల్ తెలిపారు. ఈ పేలుడు ఘటనలో ముగ్గురు కార్మికులు మరణించారని, 15 మంది గాయపడ్డారని చెప్పారు. గాయపడిన వారిని పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారని, వీరిలో కొందరికి తీవ్ర కాలిన గాయాలయ్యాయని వెల్లడించారు.