భోపాల్: బాలికపై అత్యాచారం కేసులో విచారణ నిమిత్తం రిమాండ్లో ఉన్న యువకుడైన ఖైదీ లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాడు. (Exploitation Of Inmate) జైలు పరిశీలనకు వచ్చిన న్యాయమూర్తికి దీని గురించి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో జైలు గార్డుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్లోని అగర్ మాల్వా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 2022 ఏప్రిల్లో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసుపై కోర్టులో విచారణ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో నిందితుడైన ఆ యువకుడు గత రెండేళ్లుగా రిమాండ్ ఖైదీగా జిల్లా జైలులో ఉన్నాడు.
కాగా, అగర్ మాల్వా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ శివాని శర్మ ఆ జైలును శనివారం సందర్శించారు. ఖైదీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జైలు గార్డు రూప్ సింగ్ జాదవ్పై ఆ యువ ఖైదీ ఫిర్యాదు చేశాడు. తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపించాడు. దీంతో మేజిస్ట్రేట్ ఆదేశాలపై స్థానిక పోలీసులు స్పందించారు. జైలు గార్డు రూప్ సింగ్ జాదవ్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.