ఐటీఆర్, ఆధార్-పీఎఫ్ లింక్ తదితర అంశాలకు 31 డెడ్లైన్
న్యూఢిల్లీ, డిసెంబర్ 27: మరో 3 రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతున్నది. అయితే పలు కీలకమైన ఆర్థిక అంశాలకు సంబంధించి కేంద్రం నిర్దేశించిన గడువు ఈ నెల 31తో ముగియనున్నది.
ఐటీఆర్ దాఖలు: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను రిటర్న్లు దాఖలు చేసేందుకు కేంద్రం ఇచ్చిన గడువు ఈనెల 31తో ముగియనున్నది. ఈ గడువులోగా ఐటీఆర్లు దాఖలు చేయకుంటే రూ.5 వేలు జరిమానాగా చెల్లించాల్సి వస్తుంది.
ఆధార్-పీఎఫ్ లింక్: ఈపీఎఫ్ ఖాతాకు ఆధార్ను లింక్ చేయడానికి కూడా 31 తేదీనే ఆఖరు. అనుసంధానించకుంటే ఈసీఆర్ దాఖలు చేయలేరు. దీంతో సంస్థ కాంట్రిబ్యూషన్ నిలిచిపోయే ప్రమాదం ఉన్నది.
లైఫ్ సర్టిఫికెట్: ఏటా నవంబర్ 30లోగా పింఛనుదారులు సమర్పించాల్సిన జీవన ప్రమాణ పత్రం(లైఫ్ సర్టిఫికెట్)కి ఈసారి డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చారు. బ్యాంకుకు, పోస్టాఫీస్కు వెళ్లి లేదా డోర్స్టెప్ విధానంలో ఇంటి వద్దగానీ లేదా ఆన్లైన్లో గానీ సమర్పిస్తే అవాంతరాలు లేకుండా పెన్షన్ పొందవచ్చు.
ఈపీఎఫ్వో ఈ-నామినేషన్ దాఖలు : ఈపీఎఫ్వో చందాదారులు ఆ నెలాఖరులోగా ఈ-నామినేషన్ ప్రాసెస్ను పూర్తి చేయాల్సి ఉన్నది. ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్యూరెన్స్ స్కీమ్ కింద బీమా ప్రయోజనం పొందాలన్నా, ఆన్లైన్లో పెన్షన్ క్లెయిమ్ చేసుకోవాలన్నా ఇది తప్పనిసరి.
డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాల కేవైసీ: 31లోగా డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాల కేవైసీ పూర్తి చేసుకోవాలని సెబీ ఇప్పటికే స్పష్టంచేసింది.