Uttarakhand Tunnel | హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ఉత్తరాఖండ్లో చార్ధామ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన టన్నెల్ కూలిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. ఆ కూలిన టన్నెల్లో 41 మంది కార్మికులు చిక్కుకుపోవడం.. వారికి కాపాడేందుకు 17 రోజుల పాటు రెస్క్యూ ఆపరేషన్ సాగింది. అయితే ఈ టన్నెల్ ఘటనపై పలు అనుమానాలు, విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 2016లో ఈ ఛార్దామ్ ప్రాజెక్టును ప్రారంభానికి ముందే సాంకేతిక నిపుణులు, భూగర్భ పరిశోధకులు జరుగబోయే ప్రమాదాల గురించి హెచ్చరించినా కేంద్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులు పట్టించుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రాజెక్టు విషయంలో జరిగిన పలు రివ్యూ మీటింగుల్లో భూగర్భ పరిశోధకులు దీనిపై పదేపదే హెచ్చరికలు చేసినా, వారి మాటను పెడచెవిన పెట్టారని ప్రముఖ వెబ్సైట్ సైన్స్.ఓఆర్జీ పేర్కొన్నది.
రోడ్డు నిర్మాణంలో భాగంగా కొండలను తొలచడం, సొరంగాలు నిర్మించే ప్రక్రియలో కొండచరియలు విరిగి పడతాయని, వరదలు సంభవిస్తాయని హెచ్చరించారని తన కథనంలో పేర్కొన్నది. ఇటీవల జరిగిన టన్నెల్ ఘటన నేపథ్యంలో ఇప్పటికైనా చార్ధామ్ ప్రాజెక్టు నిర్మాణ పనులను పునఃపరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి విపత్తులు మళ్లీ పునరావృతం కాకుండా నిర్మాణ ప్రణాళికలను పరిశీలించటానికి, నివారణ చర్యలు తీసుకొనేలా న్యాయ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వానికి అవసరమైన ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లోని భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీకి చెందిన పర్యావరణ శాస్త్రవేత్త అంజల్ ప్రకాశ్ అభిప్రాయపడ్డారు.
ఈ రోడ్డు నిర్మాణ కార్యకలాపాల సమయంలో పలుచోట్ల ఇప్పటికే ప్రమాదాలు జరిగి కార్మికులు చనిపోయారని పేర్కొంటూ వెబ్సైట్ పలు ఘటనలను ఉదహరించింది. హిమాలయ రీజియన్లో అశాస్త్రీయ అభివృద్ధి పనులను జరుగనివ్వబోమని, సొరంగం కూలిన ఘటనపై ప్రభుత్వం ఇప్పటికైనా కండ్లు తెరవాలని ప్రముఖ పర్యావరణ ఉద్యమకారిణి, న్యాయవాది మల్లికా భానోత్ డిమాండ్ చేశారు.