coronavirus | కరోనావైరస్ మళ్లీ బుసలు కొడుతోంది. ఒకవైపు కొవిడ్ కేసులు పెరుగుతుంటే.. మరోవైపు కొత్త వేరియంట్ బయటపడి మరింత కలవరపెడుతోంది. కేరళలో జేఎన్.1 కేసులు బయటపడటంతో ఈ వేరియంట్ ఎంత ప్రమాదకరమైనదో.. ఇది ఎంతటి విపత్తును సృష్టిస్తుందోనని అంతా భయపడిపోతున్నారు. ఈ క్రమంలో ఈ వేరియంట్ వ్యాప్తికి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కు చెందిన మైక్రోబయాలజిస్ట్ సౌమిత్ర దాస్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఇప్పుడు క్రిస్మస్ సెలవులు ఉండటంతో అక్కడ జేఎన్.1వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉందని.. అయితే భారత్లో మాత్రం అంత ప్రమాదకరమైన పరిస్థితులు లేవని అభిప్రాయపడ్డారు.
లగ్జెంబర్గ్లో తొలిసారి బయటపడిన ఈ వేరియంట్ ఇప్పుడు 38 దేశాల్లో విజృంభిస్తోందని సౌమిత్ర దాస్ తెలిపారు. క్రిస్మస్, సెలవు రోజులు కావడంతో చాలామంది అంతర్జాతీయ ప్రయాణికులు ఈ సమయంలో దేశాలు తిరుగుతుంటారని ఆయన గుర్తు చేశారు. కాబట్టి ఈ సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ఫస్ట్ వేవ్ నుంచి మొదలు పెడితే.. డెల్టా, ఒమిక్రాన్ ఈ వేవ్లు అన్నీ డిసెంబర్లోనే మొదలయ్యాయని గుర్తు చేశారు. ఇప్పుడు జేఎన్.1వేరియంట్ కూడా అదే సమయంలో మొదలయ్యిందని తెలిపారు. అందుకే ఈ సమయంలో భారత ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎయిర్పోర్టుల వద్ద నిఘా పెంచాలని.. ప్రయాణికులకు కొవిడ్-19 టెస్ట్, స్క్రీనింగ్ తప్పనిసరి చేయాలని సూచించారు. ప్రస్తుతం కొత్త వేరియంట్ విజృంభణ అదుపులోనే ఉందని.. మనం కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని పేర్కొన్నారు.