న్యూఢిల్లీ, నవంబర్ 22: ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థల్లో ఒకటైన భారతీయ రైల్వే పట్టాలు తప్పింది. నిర్వహణ లోపం, నిధుల కొరత, పాతకాలం నాటి విధానాలు, ప్రయాణికులకు చుక్కలు చూపించే ప్రయాణాలు, పెంటకుప్పల్లాంటి స్టేషన్లు వెరసి పేదవాడి ప్రయాణ సాధనం పూర్తిగా గాడి తప్పింది. గత 9 ఏండ్లలో ఏ ఒక్క ఏడాది కూడా సంస్థ లక్ష్యాలను సాధించలేదంటే పరిస్థితిని అర్థంచేసుకోవచ్చు. ఈ పరిస్థితికి కారణం ఏమిటి?
భారతీయ రైల్వేల నిర్వహణ గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. సంస్థ కార్యకలాపాలపై ఎవరికీ బాధ్యత ఉండదు. ఈ మాటలన్నది మరెవరో కాదు.. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్). ఈ సంస్థ 2021-22లో విడుదల చేసిన నివేదిక ప్రకారం మన రైల్వేస్ రూ.100 సంపాదించటానికి రూ.107.39 ఖర్చు చేస్తున్నదట. అంటే ఆదాయం కంటే ఖర్చు రూ.7.39 ఎక్కువ.
రైల్వేస్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు మోదీ ప్రభుత్వం 2017లో రాష్ట్రీయ రైల్ సంరక్ష కోష్ (ఆర్ఆర్ఎస్కే) పేరుతో నిధిని ఏర్పాటు చేసింది. ఈ నిధి నుంచి రైల్వేలో పాదాల మసాజర్స్, మట్టిపాత్రలు, ఎలక్ట్రికల్ ఉపకరణాలు, ఫర్నిచర్, చలికోట్లు, కంప్యూటర్స్, ఎస్కలేటర్లు కొనుగోలు చేసేందుకు, టాయ్లెట్ల నిర్మాణానికి, జీతాలు, బోనస్లు చెల్లింపులకు ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఈ నిధికి ఏటా రైల్వేస్ రూ.15000 కోట్లు, కేంద్ర బడ్జెట్ నుంచి రూ.5000 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. అంటే ఏటా ఈ నిధికి రూ.20,000 కోట్లు వస్తాయన్నమాట. ఒక్క ఏడాది కూడా పూర్తి నిధులు రాలేదు. ఈ నిధికి రూ.4,225 కోట్లు మాత్రమే సమకూరాయి. రూ.15,775 కోట్లు రాలేదు. అంటే.. మూడింట ఒక వంతు నిధులు కూడా ఈ నిధికి అటు రైల్వేస్గానీ, ఇటు ప్రభుత్వంగానీ సమకూర్చలేదు.
కాగ్ ప్రకారం 2020-21 నాటికి డిప్రిసియేషన్ రిజర్వ్ ఫండ్ నుంచి సంస్థకు రూ.94,873 కోట్లు రావాలి. వాటిలో దాదాపు 60 శాతం.. అంటే రూ.58,459 కోట్లను రైల్వే ట్రాక్లను మార్చేందుకు వాడాల్సి ఉన్నది. కానీ, ఎంత వాడిందో తెలుసా? అక్షరాలా రూ.671.92 కోట్లు. అంటే లక్ష్యంలో కేవలం 0.7 శాతం అన్నమాట. ఇదీ రైల్వేల నిర్వహణ తీరు.
ప్రపంచమంతా బుల్లెట్ రైళ్లు, హైపర్లూప్ రైళ్లు అని పరుగెడుతుంటే.. భారతీయ రైల్వేస్ మాత్రం ఇంకా ధూమశకటాల స్థాయిలో ఉన్నది. ఇప్పుడిప్పుడే ఏసీ కోచ్లను పెంచుతున్నది. ప్రయాణీకుల రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేసి బోగీలను పెంచటం తగ్గించటం చేయాలి. కానీ, మన రైల్వేస్లో అలాంటిది చాలా అరుదు. ఇంకా జనరల్, స్లీపర్ కోచ్లను పక్కన పెట్టేసి ఏసీ 3 టైర్ కోచ్లను రైళ్లకు తగిలిస్తుండటంతో.. సాధారణ ప్రయాణీకులకు రైలెక్కటం గగనంగా మారింది. మన రైళ్లలో ప్రయాణించేవారు అత్యధికులు జనరల్, స్లీపర్ బోగీల్లోనే వెళ్తారు. ఏసీ కోచ్ల్లో ప్రయాణం ఖరీదు కావటంతో వాటివైపు చూడరు. కానీ, జనరల్ టికెట్ తీసుకొని రైలెక్కిన ప్రయాణీకులకు ఆ భోగీల్లో కాలుపెట్ట సందు లేకపోవటంతో రిజర్డ్ బోగీల్లోకి వెళ్లి కూర్చుంటున్నారు. అప్పటికే ఆ సీట్లు బుక్చేసుకొన్నవారికి చేతిలో టికెట్ ఉన్నా కూర్చొనేందుకు సీటు దొరకటం లేదని కాగ్ తన నివేదికలో పేర్కొన్నది.
మన రైళ్ల సమయ పాలన గురించి దేశంలో తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. 2012-13 లో 79 శాతం రైళ్లు ఆలస్యంగా నడువగా, 2018-19 నాటికి 69.23 శాతానికి తగ్గింది. అయినా, నూటికి 70 రైళ్లు ఆలస్యంగానే నడుస్తున్నాయని కాగ్ నివేదిక ఎత్తిచూపింది. మరోవైపు, ఏటా రైళ్ల సగటు వేగం తగ్గిపోతున్నదని కాగ్ కుండబద్ధలు కొట్టింది.