డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ బీజేపీ బహిష్కరించిన మంత్రి హరక్ సింగ్ రావత్ కాంగ్రెస్ పార్టీలో శుక్రవారం చేరారు. ఈ సందర్భంగా బీజేపీపై ఆయన మండిపడ్డారు. బీజేపీ తనను ‘యూజ్ అండ్ త్రో’గా భావించిందని విమర్శించారు. దీనికి తాను చాలా బాధపడ్డానని అన్నారు. తాను హామీ ఇచ్చిన మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తన స్నేహం చివరి క్షణం వరకు విడదీయలేనిదని చెప్పారు. మార్చి 10న కాంగ్రెస్ పూర్తి మెజారిటీతో గెలుపొందడమే తన క్షమాపణ అని అన్నారు. అయితే రాజకీయాల్లో క్షమాపణలు ఉండవని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా, 2016లో హరీష్ రావత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మైనార్టీకి తగ్గించడంలో హరక్ రావత్ కీలకపాత్ర పోషించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన ఆయన 2016లో బీజేపీలో చేరారు. అనంతరం బీజేపీ ప్రభుత్వంలో మంత్రి అయిన హరక్ రావత్, వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో తన బంధువులకు టిక్కెట్లు ఇవ్వాలని పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఈ ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఆయనను ఇటీవల పార్టీ నుంచి బహిష్కరించింది. అయితే ఈ అభియోగాన్ని ఆయన ఖండించారు.
మరోవైపు హరాక్ రావత్ను మంత్రివర్గం నుంచి తప్పించాలని కోరుతూ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ గవర్నర్కు లేఖ రాశారు. ఈ పరిణామాల నేపథ్యంలో బుధవారం ఆయన ఢిల్లీలోని కాంగ్రెస్ అధినేత్రిని కలిశారు. తన పలుకుబడితో కనీసం పది స్థానాల్లో కాంగ్రెస్ గెలిచేలా చేస్తానని భరోసా ఇచ్చారు. దీంతో శుక్రవారం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడాన్ని కొందరు నేతలు, కార్యకర్తలు గురువారం వ్యతిరేకించారు. కాగా, ఉత్తరాఖండ్లో ఫిబ్రవరి 14న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.