న్యూఢిల్లీ, నవంబర్ 27: ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల పరిమితి ఎత్తివేసే దిశగా కేంద్రం కసరత్తు చేస్తున్నది. ప్రైవేట్ కాలేజీల్లోని మౌలిక వసతులు, టీచింగ్ ఫ్యాకల్టీని దృష్టిలో పెట్టుకొని సీట్ల సంఖ్యను పెంచుకునే విధంగా ‘ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్’ (ఏఐసీటీఈ) సరికొత్త నిబంధనావళిని తీసుకురాబోతున్నది. ‘ప్రైవేట్ కాలేజీలు ఆఫర్ చేస్తున్న వివిధ కోర్సులకు సంబంధించి సీట్ల పరిమితిలో మినహాయింపులు ఇవ్వదలుచుకున్నాం. ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి’ అని ఏఐసీటీఈ సభ్యుడు రాజీవ్ కుమార్ తాజాగా వెల్లడించారు. ‘వివిధ కోర్సులు, ప్రోగామ్స్ ఆఫర్ చేస్తున్న కాలేజీల్లో సీట్ల పరిమితి ఎత్తేయాలని కౌన్సిల్ ప్రతిపాదించింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నాం’ అని ముసాయిదా ప్రతిలో ఏఐసీటీఈ పేర్కొన్నది.
ఈ నిర్ణయంపై టాప్ ఇంజినీరింగ్ కాలేజీలు హర్షం వ్యక్తం చేస్తుండగా, తమ కాలేజీల్లో అడ్మిషన్లు పడిపోతాయని మిడ్ లెవల్ కాలేజీలు ఆందోళన చెందుతున్నాయి. ‘ఈ నిర్ణయం టాప్ ఇంజినీరింగ్ కాలేజీలు, మిడ్ లెవల్ కాలేజీల మధ్య అసమానతల్ని పెంచుతుంది. అడ్మిషన్లు పడిపోతే నాణ్యమైన విద్యను మిడ్ లెవల్ కాలేజీలు అందించలేని పరిస్థితి ఏర్పడుతుంది’ అని ఓ కాలేజీ డైరెక్టర్ అన్నారు.