ఉక్రెయిన్పై రష్యా రోజురోజుకీ అత్యంత పాశవికంగా దాడులకు తెగబడుతున్నా.. భారత ప్రభుత్వం మాత్రం అక్కడి భారతీయులను తరలించడంలో అలసత్వం వహిస్తోందని కేంద్ర విదేశాంగ శాఖ మాజీ మంత్రి , తృణమూల్ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా విమర్శించారు. ప్రభుత్వం అనుసరించే విధానాల వల్లే ఉక్రెయిన్లో భారతీయులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ప్రస్తుతం ఉక్రెయిన్లో 18,000 మంది భారతీయులు ఉన్నారని, గతంలో గల్ఫ్ సంక్షోభం తలెత్తినప్పుడు లక్షకు పైగా భారతీయులు సురక్షితంగా స్వదేశానికి తెచ్చారని యశ్వంత్ సిన్హా ఈ సందర్భంగా గుర్తు చేశారు.
‘ఉక్రెయిన్లో 18,000 మంది భారతీయులున్నారు. 1990 సమయాల్లో గల్ఫ్ యుద్ధం సంభవించింది. ఆ సమయంలో దాదాపు లక్షా 70 వేల మందిని కువైట్ నుంచి సురక్షితంగా తరలించారు. ఈ తరలింపును అప్పటి విదేశాంగ మంత్రి ఐకే గుజ్రాల్ స్వయంగా పర్యవేక్షించారు. ఇప్పుడు కేవలం 18,000 మంది భారతీయులు మాత్రమే ఉక్రెయిన్లో ఉన్నారు. వారి తరలింపులో ఎందుకు ఆలస్యమవుతోంది?’ అంటూ విదేశాంగ శాఖ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు.
ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించడంలో తమ ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తోందంటూ కేంద్రం యూపీ ఎన్నికల్లో ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు. సాక్షాత్తూ ప్రధాని మోదీ కూడా ఇలా ప్రచారం చేస్తున్నారని, ఇదేమీ గొప్ప పని కాదని, ఇది ప్రభుత్వ బాధ్యత అని యశ్వంత్ సిన్హా గుర్తు చేశారు. రష్యా- ఉక్రెయిన్ సంక్షోభం వస్తుందని ప్రభుత్వానికి తెలుసని, ఉక్రెయిన్ గగనతలంలో ఆంక్షలు లేనప్పుడే భారతీయులను తరలించి వుంటే బాగుండేదని యశ్వంత్ సిన్హా అన్నారు.