న్యూఢిల్లీ: ఒక మహిళతో వివాహేతర సంబంధం నేపథ్యంలో మాజీ నేవీ వ్యక్తి (Ex Navyman) ముగ్గురిని హత్య చేశాడు. ఆ తర్వాత పేరు మార్చుకుని మరో రంగంలో సెటిల్ అయ్యాడు. అయితే 20 ఏళ్ల తర్వాత పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. హర్యానాకు చెందిన బాలేష్ కుమార్ 8వ తరగతి వరకు చదివాడు. 1981లో నేవీలో చేరిన అతడు 1996లో పదవీ విరమణ పొందాడు. ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ వ్యాపారం ప్రారంభించాడు. కుటుంబంతో కలిసి ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో నివసించాడు.
కాగా, స్నేహితుడైన రాజేష్ భార్యతో కుమార్కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో 2004లో మద్యం మత్తులో ఉన్న వారి మధ్య ఈ అంశంపై గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో కుమార్, తన సోదరుడితో కలిసి గొంతు నొక్కి రాజేష్ను హత్య చేశాడు. బీహార్కు చెందిన ఇద్దరు కూలీలతో కలిసి మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. అనంతరం వారితో కలిసి పారిపోయేందుకు ప్లాన్ వేశాడు. కూలీలతో కలిసి సోదరుడి లారీలో ప్రయాణించిన కుమార్ రాజస్థాన్లోని జోధ్పూర్లో ఆ వాహనానికి నిప్పుపెట్టాడు. తన పత్రాలను ఆ వాహనంలో వదిలేశాడు. అందులోని ఇద్దరు కూలీలు సజీవ దహనమయ్యారు.
మరోవైపు కాలిన లారీలో ఉన్న పత్రాల ఆధారంగా ఒక మృతుడ్ని కుమార్గా రాజస్థాన్ పోలీసులు గుర్తించారు. రాజేష్ హత్య కేసుపై దర్యాప్తు జరిపిన ఢిల్లీ పోలీసులు కుమార్ సోదరుడ్ని అరెస్ట్ చేశారు. మరో నిందితుడైన కుమార్ రాజస్థాన్లో జరిగిన లారీ అగ్నిప్రమాదంలో సజీవ దహనమైనట్లు రిపోర్ట్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీమా, పెన్షన్ బెనిఫిట్స్ అతడి భార్యకు అందాయి.
కాగా, కుమార్ తన పేరును అమన్ సింగ్గా మార్చుకున్నాడు. ఢిల్లీలోని మరో ప్రాంతంలో ప్రాపర్టీ డీలర్గా పనిచేస్తున్నాడు. అయితే అతడు బతికే ఉన్నట్లు పోలీసులకు ఇటీవల తెలిసింది. దీంతో 20 ఏళ్ల తర్వాత ప్రస్తుతం 60 ఏళ్ల వయస్సున్న కుమార్ను రాజేష్ హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి ప్రశ్నించగా బీహార్ కూలీల హత్య గురించి తెలిసింది. ఈ నేపథ్యంలో కాలిన లారీ కేసుపై దర్యాప్తు కోసం రాజస్థాన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.