ముంబై: ఇంటెల్ ఇండియా మాజీ హెడ్ అవతార్ సైనీ (68) బుధవారం ఉదయం నవీ ముంబైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన పెంటియం ప్రాసెసర్ డిజైనింగ్కు నేతృత్వం వహించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అవతార్ మరికొందరు సైకిలిస్ట్లతో కలిసి నేరుల్లోని పామ్ బీచ్ రోడ్డులో ఉదయం సైక్లింగ్ చేశారు.
ఉదయం దాదాపు 5.50 గంటల ప్రాంతంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్యాక్సీ ఆయన సైకిల్ను ఢీకొట్టింది. ఆ ట్యాక్సీ డ్రైవర్ తప్పించుకుని, పారిపోయేందుకు ప్రయత్నించడంతో, సైకిల్ ఫ్రేమ్ ఆ కారుకు తగులుకుని, కొంత దూరం లాక్కుని వెళ్లిపోయింది. దానితోపాటు అవతార్ను కూడా రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లింది. ఆయన హెల్మెట్ ధరించినప్పటికీ, తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను సమీపంలోని దవాఖానకు తరలించారు. అప్పటికే ఆయ న మరణించారని వైద్యులు తెలిపారు.