(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): పారదర్శక ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు సృష్టించే చర్యలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయని ఎన్నికల సంఘం మాజీ ప్రధాన అధికారులు (సీఈసీ) ఆందోళన వ్యక్తం చేశారు. విపక్ష పార్టీ నేతల ఇండ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు, కీలక నాయకులకు ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) నోటీసులు ఇవ్వడం, ఖాతాల స్తంభన ఇందులో భాగమేనని అభిప్రాయపడ్డారు. ఎన్నికల సమయంలో ఇది సహేతుకమైన చర్య అనిపించుకోబోదని, ఈ విషయంలో ఈసీ వెంటనే జోక్యం చేసుకోవాల్సిన అవసరమున్నదన్నారు. ఈ మేరకు జాతీయ పత్రిక ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాజీ సీఈసీ ఎస్వై ఖురేషీతో పాటు పేరు బయటపెట్టడానికి ఇష్టపడని మరో ఇద్దరు మాజీ సీఈసీలు మాట్లాడారు. లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే కవిత, ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ తదితర నేతలపై ఈడీ కేసులు పెట్టడం, కాంగ్రెస్కు ఐటీ నోటీసులు జారీ చేయడం, ఖాతాలను ఫ్రీజ్ చేయడం తెలిసిందే. ఈ క్రమంలో మాజీ సీఈసీల వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకొన్నాయి.
నిధులెక్కడ నుంచి వస్తాయి?
మేం సీఈసీలుగా ఉన్నప్పుడు ఇలాంటివి ఎప్పుడూ జరుగలేదు. ఖాతాలను స్తంభింపజేస్తే.. ప్రచారానికి పార్టీలకు నిధులెక్కడ నుంచి వస్తాయి? దీనిపై ఈసీ, సీబీడీటీతో చర్చించాలి.
– (పేరు చెప్పడానికి ఇష్టపడని) ఇద్దరు మాజీ సీఈసీలు
వాయిదాతో భారీ నష్టమైతే జరుగదు కదా!
ఎన్నికల ప్రచార సమయంలోనే విపక్ష నేతలకు ఈడీ, ఐటీ నోటీసులు ఇవ్వడమేంటి? పోలింగ్ పూర్తైన తర్వాత కూడా ఇవన్నీ చేయవచ్చు కదా? సోదాలు, నోటీసుల వంటి పనులను తాత్కాలికంగా వాయిదా వేస్తే.. సరిదిద్దుకోలేని నష్టం వాటిల్లుతుందని నేననుకోవట్లేదు. ఈ చర్యలపై ఈసీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.
– మాజీ సీఈసీ ఎస్వై ఖురేషీ