న్యూఢిల్లీ: విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్తు సంస్థలపై కేంద్రం ఒత్తిడి తీసుకురావడంపై పలు ప్రశ్నలు లేవనెత్తుతూ మాజీ బ్యూరోక్రాట్, కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబాకు లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(పీఎస్పీసీఎల్) అంశాన్ని ప్రస్తావించారు. జార్ఖండ్లోని పచ్వారాలో తన సొంత గని నుంచి బొగ్గును తెచ్చుకొనేందుకు పీఎస్పీసీఎల్ కోరగా.. అందుకు నిరాకరించిన కేంద్ర విద్యుత్తు శాఖ విదేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకోవాలని ఒత్తిడి చేసిందని అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ దిగుమతి చేసుకొనే బొగ్గు వల్ల(పీఎస్పీసీఎల్కు అవసరమైన బొగ్గులో 6 శాతం) పీఎస్పీసీఎల్తో పాటు రాష్ట్రంలోని విద్యుత్తు వినియోగదారులపై అధిక భారం పడుతుందని అన్నారు. విదేశాల్లోని గనుల నుంచి బొగ్గును సరఫరా చేసే దేశంలోని కొన్ని కంపెనీలకు అనుచిత లబ్ధి చేకూర్చేందుకే ఇలా చేస్తున్నారని శర్మ ఆరోపించారు. ఈ విధమైన ఒత్తిడి చేయకుండా జోక్యం చేసుకోవాలని ఆయన గౌబాను కోరారు. కృత్రిమ బొగ్గు కొరత సృష్టితో కేంద్రం సెల్టార్స్ మార్కెట్(అమ్మకానికి సరుకు కొరత పరిస్థితి ఫలితంగా అమ్మకందారుడి ధరను నిర్ణయించే శక్తి లభించడం) సృష్టించడం, బొగ్గు దిగుమతికి విద్యుత్తు సంస్థలపై ఒత్తిడి తేవడంపై గతంలో పరిశోధన్మాతక కథనాలు వెలువడ్డాయని పేర్కొన్నారు.
పచ్వారా గని నుంచి బొగ్గు వినియోగానికి రాజ్పుర, తల్వాండిలోని ప్రైవేటు విద్యుత్తు సంస్థలను అనుమతించిన కేంద్రం.. పీఎస్పీసీఎల్కు మాత్రం అనుమతి ఇవ్వలేదన్నారు. దీని వలన పీఎస్పీసీఎల్ రావాల్సిన అర్థికపరమైన లబ్ధి ప్రైవేటు సంస్థలకు వెళ్లేలా కేంద్రం ఆదేశాలు ఉన్నాయని, ఇది వివక్షతో కూడుకొన్నదని ఆరోపించారు. బొగ్గు దిగుమతుల ద్వారా ప్రైవేటు సరఫరాదారులు, అదేవిధంగా గుజరాత్ పోర్టు ప్రైవేటు ప్రమోటర్లకు లబ్ధి చేకూర్చేలా కేంద్ర విద్యుత్తు శాఖ ఆదేశాలు ఉన్నాయని విమర్శించారు. విదేశాల నుంచి భారత్కు బొగ్గు ఎగుమతిలో మోదీ ఆప్త మిత్రుడు అదానీకి చెందిన కంపెనీదే అగ్రస్థానం.