పట్నా: బీహార్ అధికార కూటమిలోని జేడీయూ పార్టీలో సీఎం నితీశ్కుమార్, సీనియర్ నేత ఉపేంద్ర కుశ్వాహ మధ్య వివాదం మరింత ముదిరింది. ఉపేంద్ర కుశ్వాహ గత కొన్ని రోజులుగా పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. దాంతో ఆయన బీజేపీతో టచ్లో ఉన్నాడంటూ జేడీయూ ఆరోపిస్తున్నది. ఈ క్రమంలోనే ఉపేంద్ర కుశ్వాహ పార్టీకి రాజీనామా చేయాలని కొందరు జేడీయూ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ డిమాండ్లపై తాజాగా ఉపేంద్ర కుశ్వాహ స్పందించారు. తాను సీఎం నితీశ్కుమార్ చెప్పినా జేడీయూను వీడనని అయన వ్యాఖ్యానించారు. ఇక తాను బాధ్యత తీసుకుంటానని, పార్టీని కాపాడటం కోసం పోరాడుతానని చెప్పారు. ప్రస్తుతం జేడీయూలో నెలకొన్న పరిస్థితి తనను బాధిస్తోందన్నారు. తాను బీజేపీతో టచ్లో ఉన్నట్లు ఆరోపణలు చేస్తున్నారని, ఆఖరికి సీఎం కూడా ఈ వ్యాఖ్యలు నమ్మడం బాధాకరమని పేర్కొన్నారు.
పార్టీలో తమరికి కావాల్సిన వాళ్లెవరో, కాని వాళ్లెవరో తెలుసుకోమని సీఎం నితీశ్కుమార్కు తాను సలహా మాత్రమే ఇచ్చానని ఉపేంద్ర కుశ్వాహ చెప్పారు. అటు సీఎం నితీశ్కుమార్ మాత్రం కుశ్వాహ బీజేపీతో టచ్లో ఉన్నాడనే విషయాన్ని బలంగా నమ్ముతున్నారు. అందుకే విలేకరులు కుశ్వాహ విషయాన్ని ప్రస్తావించగానే.. తన ముందు అతని ప్రస్తావన తీసుకురావద్దని చెప్పారు. పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోయినా నష్టం లేదన్నారు.