EPFO : దేశంలో ఎవరూ క్లెయిమ్ చేసుకోకుండా మిగిలిపోయిన ఎల్ఐసీ నిధులు రూ.7,318.5 కోట్లు ఉన్నట్లు కేంద్రంప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం పార్లమెంట్లో ప్రకటన చేసింది. ఇందులో పాలసీదారుల సొమ్ము రూ.5,564.5 కోట్లు ఉంది. ఈ మొత్తం ద్వారా సంస్థకు లభించిన ఆదాయం రూ.1,753.95 కోట్లు. ఈ మొత్తం కలిపి రూ.7,318.5 కోట్లు అని కేంద్రం తెలిపింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఈ విలువ ఉన్నట్లు కేంద్రం తెలిపింది. మరోవైపు ఈపీఎఫ్వోలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది.
ఇందులో కూడా ఎవరూ క్లెయిమ్ చేసుకోని, వినియోగంలో లేని అకౌంట్లలో దాదాపు రూ.9,330.5 కోట్లు ఉన్నాయి. ఇదంతా ఈపీఎఫ్వో ఖాతాదారుల సొమ్మే. అయితే, ఇలా వినియోగంలో లేని అకౌంట్లకు ప్రస్తుతం ఎలాంటి నిధులు జమకావడం లేదు. ఇవి పూర్తి నిరుపయోగంగా ఉన్నాయి. అయితే, ఇలా చాలాకాలంగా వినియోగంలో లేని అకౌంట్లకు సంబంధించిన నిధుల్ని ఖాతాదారుల అకౌంట్లలో జమ చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. చిన్న మొత్తాల్ని అకౌంట్లలో జమ చేసే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది. రూ.1,000 కంటే తక్కువ నిధులున్న ఖాతాదారుల అకౌంట్లలోని డబ్బును, అర్హత కలిగిన, ఆధార్తో లింక్ అయిన లబ్ధిదారుల అకౌంట్లలోకి జమ చేస్తున్నట్లు తెలిపింది. ఇలా నిరుపయోగంగా ఉన్న ఖాతాల సంఖ్యను తగ్గించడంతోపాటు, అర్హులైన లబ్ధిదారులకు ఈ మొత్తం చేరాలన్న ఉద్దేశంతో నిధుల్ని ఆటోక్రెడిట్ చేస్తున్నట్లు కేంద్రం వివరించింది.
ఈ మిగిలిపోయిన నిధుల్ని ఇతర సంస్తలకు మళ్లిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. మిగిలిపోయిన నిధుల్ని లబ్ధిదారుల ఖాతాలకు మళ్లించడం తప్ప, ఆ నిధుల్ని ఇతర అవసరాలకు వాడుకోవాలనే ఉద్దేశం లేదని కేంద్రం తేల్చిచెప్పింది. ఆ నిధుల్ని లబ్ధిదారుల కోసం అలాగే అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. అవసరమైన లబ్ధిదారుల్ని గుర్తించే, వారికి నిధుల్ని జమ చేసే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది. ఈ ప్రక్రియ అంతా డిజిటల్ పద్ధతిలో, ఆధార్ వెరిఫికేషన్ ద్వారా సాగుతోందని కేంద్రం వెల్లడించింది.