న్యూఢిల్లీ: తేజస్ యుద్ధ విమానాల(Tejas Jets)ను గ్రౌండ్ చేశారు. ప్రస్తుతం భారతీయ వైమానిక దళంలో సుమారు 35 తేజస్ యుద్ధ విమానాలు ఉన్నాయి. మెయింటేనెన్స్ చెకింగ్ నేపథ్యంలో ఆ యుద్ధ విమానాలను గ్రౌండ్ చేసినట్లు ఐఏఎఫ్ వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 7వ తేదీన ఓ తేజస్ విమానం కూలిన ఘటన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో రన్వే మీద నుంచి పక్కకు వెళ్లి ఆ విమానం కూలింది. వెస్ట్రన్ ఫ్రంట్లో ఈ ఘటన జరిగింది. రన్వే సమీపంలో ఉన్న బురద గుంటలో ఆ విమానం పడింది. వాస్తవానికి ఆ ప్రమాదానికి చెందిన పూర్తి నివేదిక లేదు. కానీ తమ దళంలో ఉన్న అన్ని తేజస్ విమాలను చెక్ చేయాలని ఐఏఎఫ్ ఆదేశించింది.
విమానాలను గ్రౌండ్ చేసిన తర్వాత వాటిని పూర్తిగా, క్షుణ్ణంగా పరీక్షిస్తారు. వీల్స్కు చెందిన ఎలక్ట్రోమ్యాగ్నటిక్ బ్రేకింగ్ సిస్టమ్, ఆన్బోర్డ్ సాఫ్ట్వేర్ ను తనిఖీ చేస్తారు. ఆ రోజు సింగిల్ సీటు విమానం ప్రమాదానికి గురైంది. దాంట్లో ఉన్న పైలెట్ సురక్షితంగా ఉన్నారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో.. కేవలం టేకాఫ్ స్పీడ్తో జెట్ ఉన్నట్లు గుర్తించారు. ఆ స్పీడ్ కేవలం 170 కిలోమీటర్ల మాత్రమే ఉన్నది. ఫిబ్రవరి ఏడో తేదీ ఘటన గురించి కానీ, ఫ్లీట్లో ఉన్న విమానాల గ్రౌండింగ్ గురించి కానీ ఐఏఎఫ్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆ ప్రమాదం పట్ల కోర్టు విచారణకు ఆదేశించారు.
ఇప్పటి వరకు మూడు తేజస్ విమానాలు కూలాయి. 2016లో తొలి తేజస్ కూలింది. 2024 జైసల్మేర్లో ఆ ఘటన జరిగింది. 2025 నవంబర్లో రెండో ఘటన జరిగింది. దుబాయ్ ఎయిర్షోలో విన్యాసం చేస్తూ ఓ విమానం పేలింది. ఆ ప్రమాదంలో వింగ్ కమాండర్ నమాన్ష్ సయల్ ప్రాణాలు కోల్పోయారు. ఫిబ్రవరి 7వ తేదీన జరిగిన ఘటన క్రాష్ కాదు అని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ తెలిపింది. 40 తేజస్ విమానాలకు ఆర్డర్ చేయగా, ప్రస్తుతం 35 సర్వీసులో ఉన్నాయి. మరో రెండు డెలివరీ చేయాల్సి ఉన్నది. మరో 180 తేజస్ మార్క్ 1ఏ విమానాల డెలివరీ ఇప్పటికే రెండేళ్ల ఆలస్యమైంది.