జైపూర్: రాజస్థాన్లో సబర్మతి-ఆగ్రా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్కు (Sabarmati Superfast Express) పట్టాలు తప్పింది. సోమవారం తెల్లవారుజామున ఒంటి గంటకు అజ్మీర్లోని మడర్ రైల్వేస్టేషన్లో సబర్మతి ఎక్స్ప్రెస్.. ఎదురుగా వస్తున్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీంతో ప్యాసింజర్ రైలు ఇంజిన్తోపాటు నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రాణనష్టం జరుగకపోవడంతో అంతాఊపిరి పీల్చుకున్నారు.
సబర్మతి సూపర్ఫాస్ట్ డ్రైవర్ అత్యవసర బ్రేకులు వేసి రైలును ఆపడానికి ప్రయత్నించినప్పటికీ అది గూడ్స్ రైలును ఢీ కొట్టిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై నార్త్ వెస్టర్న్ రైల్వే సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విటర్)లో పోస్టు చేసింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది. ప్రమాదానికి సంబంధించి వివరాల కోసం హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఘటనా స్థలంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), గవర్నమెంట్ రైల్వే పోలీసులు (GRP), రైల్వే సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఆ మార్గంలో రైళ్లను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు.