UNO | మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) స్పందించింది. అన్ని మతాల పట్ల సహనం, గౌరవాన్ని సమర్థవంతంగా ప్రోత్సహిస్తామని ఐరాస ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటేరస్ తెలిపారు. ప్రవక్తపై బీజేపీ నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పలు ముస్లిం దేశాలు తీవ్రంగా ప్రతిస్పందించాయి. భారత్ తీరును తీవ్రంగా ఖండించాయి. బీజేపీ సస్పెండ్ చేసిన నుపూర్ శర్మ, ఢిల్లీ మాజీ మీడియా విభాగం అధిపతి నవీన్ కుమార్ జిందాల్ వ్యాఖ్యలపై స్పందించాలని ఐరాస ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటేరస్ అధికార ప్రతినిధి స్టీఫేన్ డుజారిక్ను పాక్ జర్నలిస్టు కోరారు.
దీనిపై స్టీఫేన్ డుజారిక్ స్పందిస్తూ.. భారత్పై విమర్శలను చదివాను.. బీజేపీ నేతల వ్యాఖ్యలను చదవకున్నా.. పరమత సహనాన్ని ఐరాస ప్రోత్సహిస్తుందన్నారు. బీజేపీ నేతల వ్యాఖ్యలపై కువైట్, ఖతార్, ఇరాన్, సౌదీ అరేబియా, ఇండోనేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), జోర్డాన్, ఆఫ్ఘనిస్థాన్, మాల్దీవులు మండిపడ్డాయి. తమ దేశాల్లోని భారత దౌత్యవేత్తలను పిలిపించి నిరసన తెలిపాయి.