ముంబై : ముఖేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్ధాలతో వాహనాన్ని నిలిపిన కేసులో ఇవాళ ఎన్ఐఏ పోలీసులు విచారణ చేపట్టారు. ముంబై మాజీ పోలీసు అధికారి, ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా గుర్తింపు పొందిన ప్రదీప్ శర్మ ఇంట్లో ఇవాళ ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. జాతీయ దర్యాప్తు ఏజెన్సీతో పాటు సీఆర్పీఎఫ్ అధికారులు కూడా ఇవాళ ఉదయం 5 గంటలకు ప్రదీప్ శర్మ ఇంటికి వెళ్లారు. ఈ కేసులో షీలర్ అనే అనుమానితుడితో శర్మ గతంలో దిగిన ఫోటోలు బయటకు రావడంతో ఆయనపై దర్యాప్తు ప్రారంభించారు. షీలర్ గతంలో పోలీసు ఇన్ఫార్మర్గా చేసినట్లు ప్రదీప్ తెలిపారు. ఇదే కేసులో కస్టడీలో ఉన్న మాజీ ఇన్స్పెక్టర్ సచిన్ వాజేకు, శర్మకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తేలింది. మన్సుక్ హిరేన్ కేసులో ఏవైనా ఆధారాలు దొరుకుతాయన్న ఉద్దేశంతో సోదాలు చేపట్టినట్లు ఓ అధికారి చెప్పారు. ముకేశ్ ఇంటి ముందు ఉన్న వాహనంలో దొరికిన 20 జెలిటిన్ స్టిక్స్ను ప్రదీప్ శర్మ ద్వారనే తెప్పించినట్లు వాజే తెలిపారు. బాంబు బెదిరింపుతో పాటు వ్యాపారవేత్త హీరేన్ మృతి కేసులో వాజే అనుమానితుడిగా ఉన్నారు. 2019లో ప్రదీప్ శర్మ పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేశారు. శివసేన పార్టీలో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.