కోల్కతా: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమబెంగాల్లో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బసంతి పట్టణంలో జియారుల్ మోల్లా అనే టీఎంసీ కార్యకర్త హత్యకు గురయ్యారు. శనివారం రాత్రి ఆయన ఇంటికి తిరిగి వస్తుండగా దుండగులు కాల్చిచంపారని పోలీసులు వెల్లడించారు. మోల్లా కుమార్తె కథల్బేరియా గ్రామపంచాయతీలో టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పార్టీలోని మరో వర్గమే ఈ హత్యకు పాల్పడిందనే ఆరోపణలు వస్తున్నాయి.
దీంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన జూన్ 9 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10 మంది హత్యకు గురయ్యారు. ఇదే జిల్లాలోని భాంగర్లో ఓ టీఎంసీ అభ్యర్థిపై హత్యాయత్నం జరిగింది. పశ్చిమ్ మేదినిపుర్ జిల్లాలో అధికార టీఎంసీ, ప్రతిపక్ష సీపీఎం కార్యకర్తల మధ్య ఆదివారం జరిగిన ఘర్షణలో 10 మందికి గాయాలయ్యాయి. కూచ్బెహర్లోని దిన్హాతలో రెండు వర్గాల మధ్య శనివారం రాత్రి జరిగిన గొడవలో ఐదుగురు గాయపడ్డారు.