ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శివసేన అధికార పార్టీ పేరు, విల్లు-బాణం గుర్తు సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని రెబల్ వర్గానికి చెందుతాయని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) శుక్రవారం తెలిపింది. రాజకీయ పార్టీల రాజ్యాంగం ప్రకారం ఆఫీస్ బేరర్ల పోస్టులకు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు జరుగాలని పేర్కొంది. అంతర్గత వివాదాల పరిష్కారానికి న్యాయమైన విధానాన్ని అనుసరించాలని సూచించింది. సంస్థాగత సభ్యుల మద్దతును నిర్ధారించిన తర్వాత మాత్రమే పార్టీ రాజ్యాంగాన్ని సవరించాలని పేర్కొంది. షిండే వర్గానికి పెద్ద ఎత్తున సభ్యుల మద్దతు ఉన్నందున శివసేన అధికార పార్టీ పేరు, విల్లు-బాణం గుర్తు హక్కులు ఆ వర్గానికే చెందుతాయని స్పష్టం చేసింది. ఉద్ధవ్ ఠాక్రే, శివసేన రెబల్ వర్గం మధ్య గత కొన్ని నెలలుగా జరుగుతున్న ఈ వివాదానికి ఈ మేరకు ఈసీ ముగింపు పలికింది.
మరోవైపు ఈసీ ఆర్డర్పై షిండే వర్గం హర్షం వ్యక్తం చేసింది. తామే నిజమైన శివసేన అన్నది నిరూపితమైందని ఆ వర్గం ప్రతినిధి శీతల్ మహాత్రే తెలిపారు. ఈసీ నిర్ణయంతో ఉద్ధవ్ ఠాక్రే వెంట ఉన్న మరింత మంది శివ సైనికులు, నేతలు తమ చెంత చేరుతారని చెప్పారు. అయితే ప్రజల నమ్మకాన్ని ఈసీ కోల్పోయిందని ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. ఈసీ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేస్తామని చెప్పారు.
కాగా, గత ఏడాది జూన్లో ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో శివసేన రెండు వర్గాలుగా చీలింది. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేశారు. దీంతో ఎంవీఏ ప్రభుత్వం పడిపోయింది. అనంతరం బీజేపీ మద్దతుతో ఏక్నాథ్ షిండే సీఎం అయ్యారు. శివసేన పేరు, గుర్తు కోసం ఈ రెండు వర్గాలు ఈసీతోపాటు కోర్టులను ఆశ్రయించాయి. దీంతో శివసేన పేరు, గుర్తును ఫ్రీజ్ చేసిన ఈసీ తాజాగా షిండే వర్గానికే అవి చెందుతాయని శుక్రవారం పేర్కొంది. దీంతో ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లయ్యింది.