న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇవాళ ముస్లిం సోదరులు ఈద్ అల్ అదా పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో అన్ని మసీదుల్లో ముస్లింలు ప్రార్థనలు చేస్తున్నారు. అయితే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రార్థనలకు హాజరవుతున్నారు. అమృత్సర్లోని ఖైరుద్దిన్ మసీదులో ఇవాళ ఉదయం ముస్లింలు నమాజ్ చేశారు. ఢిల్లీలోని జామియా మసీదులో బక్రీద్ వేళ సామూహిక ప్రార్థనలను నిషేధించారు. సాధారణ నమాజ్ వేళలను మార్చినట్లు మసీదు ఇమామ్ తెలిపారు. కేవలం స్థానికులు మాత్రమే మసీదుకు వచ్చారు. విజిటర్స్ ఎవరూ లేరని ఇమామ్ తెలిపారు.
ముంబైలోని మాహిమ్ దర్గాలో కోవిడ్ నిబంధనల నడుమ బక్రీద్ ప్రార్థనలు జరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో సంబరాలను నియంత్రించినట్లు స్థానికలు చెప్పారు. కేరళలోని పలాయంలో ఉన్న జుమా మసీదులో సోషల్ డిస్టాన్స్ పాటిస్తూ ముస్లింలు ప్రార్థనలు చేశారు. అహ్మదాబాద్లోని జమా మసీదులో కూడా ఇవాళ ఉదయం ఈద్ అల్ అదా నమాజ్ చేశారు. తక్కువ సంఖ్యలో ఈద్ను జరుపుకునేందుకు అవకాశం ఇచ్చిన అల్లాకు మసీదు ఇమామ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈద్ అల్ అదా సందర్భంగా ప్రధాని మోదీ ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ చెప్పారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా విషెస్ తెలిపారు. ప్రేమ, త్యాగానికి ప్రతీకంగా బక్రీద్ పండుగ అని రాష్ట్రపతి అన్నారు.