TMC MLA : టీఎంసీ (TMC) నేత, ఎమ్మెల్యే మదన్ మిత్రా (Madan Mitra) కు చేదు అనుభవం ఎదురైంది. కమార్హాటీ నియోజకవర్గంలోని అరియాదయా ప్రాంతంలో కొంత గందరగోళ పరిస్థితులున్నాయనే సమాచారంతో ఆయన అక్కడకు వెళ్లారు. అప్పటికే అక్కడకు చేరుకున్న స్థానికులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. కొందరు ఆగ్రహంతో కోడిగుడ్లు విసరడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. దాంతో ఎమ్మెల్యే కాన్వాయ్ అక్కడి నుంచి ముందుకు వెళ్లిపోయింది. దాడి ఘటనపై మదన్ మిత్రా స్పందిస్తూ.. ఈ ఘటన పూర్తిగా ముందస్తు వ్యూహంపై జరిగినదేనని, బీజేపీ మద్దతుతోనే కొందరు దుండగులు ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.
అయితే దాడి సమయంలో తాను వాహనంలో లేనని, తన డ్రైవర్పై దాడి జరిగిందని చెప్పారు. కాగా దశాబ్దాలుగా ‘కట్ మనీ’ పేరుతో స్థానిక నేతలు తమవద్ద బలవంతంగా డబ్బులు వసూళ్లు చేశారని, వాటిని తిరిగి ఇవ్వాలని ఆటో-రిక్షా, ఈ-రిక్షా డ్రైవర్లు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. పశ్చిమబెంగాల్లో పలువురు టీఎంసీ నేతలకు వ్యతిరేకంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వరుస ఘటనల ఇటీవల కాలంలో చోటుచేసుకుంటున్నాయి. గత కొద్దివారాలుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజలు బహిరంగంగానే నాయకుల అవినీతి ఆరోపణలు, బలవంతపు వసూళ్లు, స్థానిక పాలనాంశాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వరకూ రాజకీయ ర్యాలీలకే పరిమితమైన ప్రజానిరసనలు ఈ మధ్య కాలంలో రాజకీయ నేతల పర్యటనల్లో చోటుచేసుకుంటున్నాయి.
టీఎంసీ ఎంపీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇటీవల సోనార్పూర్లో పర్యటించినప్పుడు ఇలాంటి నిరసనలే ఎదురయ్యాయి. అభిషేక్ ‘దొంగ’ అంటూ నినాదాలు చేసిన నిరసనకారులు ఆయనపై రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. స్థానిక సమస్యలపై నిలదీశారు. ఈ దాడి ఘటనకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అవినీతి ఆరోపణలకు సంబంధించి స్థానిక రాజకీయ నేతలు కోర్టుకు హాజరైన సందర్భాల్లో కోర్టు ఆవరణల్లోనూ, పోలీసు స్టేషన్ల ఎదుట ప్రదర్శనలు చోటుచేసుకున్నాయి. కాగా వరుస దాడుల ఘటనలను టీఎంసీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. అభిషేక్పై దాడి ఘటనకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో షేర్ చేశారు.