న్యూఢిల్లీ: కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఆక్సిజన్ కోసం డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో భారతీయ వైమానిక దళాన్ని కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దించింది. అన్ని రాష్ట్రాలకు ఆక్సిజన్ కోటాను కూడా పెంచినట్లు ప్రభుత్వం చెప్పింది. మహారాష్ట్ర, ఢిల్లీ, మధ్యప్రదేశ్, హర్యానా, యూనీ, పంజాబ్, ఏపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు కోటాను పెంచినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. మహారాష్ట్రలో ఆక్సిజన్ కోటాను 1646 మెట్రిక్ టన్నుల నుంచి 1661 మెట్రిక్ టన్నులకు పెంచేశారు. ఇక ఢిల్లీలో 378 ఎంటీ నుంచి 480, మధ్యప్రదేశ్లో 445 నుంచి 543 ఎంటీకి, హర్యానాలో 156 ఎంటీ నుంచి 162కు, యూపీలో 751 నుంచి 753 మెట్రిక్ టన్నులకు పెంచారు.
కరోనా వైరస్ ఉదృతిని నియంత్రించేందుకు వైమానిక దళాన్ని రంగంలోకి దింపినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆక్సిజన్ కంటేనర్లు, సిలిండర్లు, అత్యవసర మందులు, సామాగ్రి, వైద్య సిబ్బందిని వైమానిక దళ విమానాల్లో తీసుకువెళ్తున్నారు. కొచ్చి, ముంబై, వైజాగ్, బెంగుళూరు నుంచి డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందిని ఢిల్లీకి తరలిస్తున్నారు. తాత్కాలిక హాస్పిటల్లో వాళ్లు సేవలు అందిచనున్నారు. బెంగుళూరు నుంచి ఢిల్లీకి డీఆర్డీవో ఆక్సిజన్ కంటేనర్లను వైమానిక దళ విమానాల్లో తీసుకెళ్లారు. త్రివిధ దళాధిపతితో పాటు త్రివిధ దళాల చీఫ్లతో రక్షన మంత్రి రాజ్నాథ్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. రిటైర్ అయిన సైనిక డాక్టర్లు, నర్సులను వాలంటరీ సేవల కోసం వినియోగించుకోవాలని రక్షణ మంత్రి సూచించారు.