న్యూఢిల్లీ: దేశంలో కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో అనూహ్యంగా పెరిగిన కేసులు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో పాఠశాలలను పునఃప్రారంభించేందుకు ఆరోగ్య, భద్రతా ప్రోటోకాల్ కోసం కేంద్ర ప్రభుత్వం గురువారం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో స్కూళ్లను తెరువవచ్చని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సూచించింది. అయితే తరగతిలో టీచింగ్కు విద్యార్థుల మధ్య భౌతిక దూరం తప్పనిసరి అని పేర్కొంది. అలాగే కరోనా నియమ, నిబంధనలను కఠినంగా పాటించాలని తెలిపింది.
కాగా, విద్యార్థులు స్కూళ్లకు హాజరు కావడానికి తల్లిదండ్రుల సమ్మతి అవసరమా లేదా అన్నది రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే స్కూళ్లలో సామూహిక కార్యక్రమాలకు సంబంధించి కరోనా మార్గదర్శకాలు, సంబంధిత నియమ-నిబంధనలు తప్పక పాటించాలని సూచించింది. ప్రస్తుతం 11 రాష్ట్రాల్లో పూర్తిగా స్కూళ్లు తెరుచుకున్నాయని, 9 రాష్ట్రాల్లో మూసి ఉన్నాయని పేర్కొంది.
మరోవైపు దేశ వ్యాప్తంగా 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా కేసులతోపాటు పాజిటివిటీ రేటు తగ్గిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే కేరళ, మిజోరాం రాష్ట్రాల్లో కరోనా కేసుల పెరుగుదలను గుర్తించినట్లు పేర్కొంది. కాగా, ప్రస్తుత వేరియంట్ వల్ల సర్జరీలకు ఎలాంటి ముప్పులేదని చెప్పింది. దీంతో రోగులకు సర్జరీ అవసరాన్ని తిరస్కరించవద్దని సూచించింది.