ముంబై: భారతీయ సంస్కృతిలో విద్యను పవిత్రమైనదిగా, దైవ సంబంధమైనదిగా పరిగణిస్తామని, అయితే నేడు అది భరించలేనిదిగా మారిందని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. నాణ్యమైన విద్యను ప్రతి ఒక్కరికీ చేరువ చేయడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పింది. పుణేలో విద్యా సంస్థలను ఏర్పాటు చేసేందుకు రెండు ఆర్గనైజేషన్లకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేయడానికి తిరస్కరించింది.
సంబంధంలేని కారణాలతో తమ దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించిందని జాగృతి ఫౌండేషన్, సంజయ్ మోదక్ ఎడ్యుకేషన్ సొసైటీ పిటిషన్లను దాఖలు చేశాయి. హైకోర్టు ఫిబ్రవరి 21న తీర్పు చెప్తూ, విద్యా సంస్థను ఏర్పాటు చేయడం కోసం భూమి స్వభావం, ఆర్థిక వనరుల లభ్యత, మౌలిక సదుపాయాలు వంటివాటిని పరిశీలించవలసి ఉంటుందని తెలిపింది. దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించడం నిరంకుశత్వం, అన్యాయం అని చెప్పలేమని వివరించింది.