ED on Sisodia | లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇంటితోపాటు పలు ఇతర ప్రాంతాలపై సీబీఐ దాడులు చేసింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సహా 15 మంది పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చింది సీబీఐ. ఐపీసీలోని 120బీ, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద కేసు నమోదు చేసింది. ఇదే కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా హవాలా లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)లోని రెండు సెక్షన్లు సహా మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేయనున్నది. ఈ రెండు సెక్షన్ల కింద కేసులు నమోదైతే పీఎంఎల్ఏ కిందకు వస్తాయి. ఆటోమేటిక్గా ఈడీ రంగ ప్రవేశం చేయడానికి అవకాశం ఉంటుంది.
ప్రతి నేరం విషయంలోనూ ఈడీ చర్యలు తీసుకునే అవకాశాలు లేవని ఈడీ మాజీ డిప్యూటీ డైరెక్టర్ సత్యేంద్ర సింగ్ తెలిపారు. ఐపీసీ, చట్ట విరుద్ధ కార్యక్రమాల నిరోధక చట్టం (యూఏపీఏ), కంపెనీల చట్టం, ఆయుధాల చట్టం, కస్టమ్స్ చట్టం మాదిరిగానే పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఐపీసీలోని 120 బీ, అవినీతి నిరోధక చట్టం (పీసీ)లోని సెక్షన్-7 కింద కేసు నమోదైతే ఈడీ దర్యాప్తులో భాగస్వామి కావచ్చు.
హవాలా లావాదేవీల నిరోధక చట్టాన్ని (పీఎంఎల్ఏ) 2002లో ఆమోదిస్తే 2005లో అమల్లోకి వచ్చింది. 2012లో చేసిన సవరణ ప్రకారం నేరాల జాబితా విస్తరించేందుకు అవకాశం ఉంటుంది. 2012 సవరణ ప్రకారం డబ్బు దాచి పెట్టడం, నేరపూరితంగా వినియోగించడం వంటి అంశాలు ఈడీ పరిధిలోకి వస్తాయి. రాజకీయ స్కామ్లపై చర్య తీసుకోవడానికి ఈడీకి అధికారమిస్తూ.. అవినీతి నిరోధక చట్టంలోని పార్ట్-ఏ విభాగంలో సవరణలు చేశారు.
ఆస్తులను జప్తు చేయడానికి, నిందితులను అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేయడానికి, దర్యాప్తు, తనిఖీలు చేపట్టడానికి ఈడీకి పీఎంఎల్ఏ అధికారం దఖలు పరిచింది. తన అమాయకత్వాన్ని రుజువు చేసుకునేందుకు అవసరమైన ఆధారాలు సమర్పించాల్సిన బాధ్యత నిందితుడిదే. నిందితులపై దర్యాప్తు సమయంలో కఠినమైన బెయిల్ షరతులు, అరెస్ట్కు కారణాలు వెల్లడించకపోవడం, ఎఫ్ఐఆర్ మాదిరిగా ఈసీఐఆర్ లేకుండా అరెస్ట్, హవాలా లావాదేవీలకు విస్తృత నిర్వచనం ఇవ్వడం వంటి అధికారాలు ఈడీకి ఉన్నాయి.
పీఎంఎల్ఎ కింద ఏడాదిలోపే నలుగురు ప్రముఖ మంత్రులను జైలుకు పంపింది ఈడీ. మహారాష్ట్రలో ఇద్దరు క్యాబినెట్ మంత్రులుగా పని చేసిన అనిల్ దేశ్ముఖ్, నవాబ్ మాలిక్ ఉన్నారు. దావూద్ ఇబ్రహీం అనుబంధ హవాలా లావాదేవీల కేసులో నవాబ్ మాలిక్ను అరెస్ట్ చేసింది. ఉద్వాసనకు గురైన పోలీసు అధికారి సచిన్ వాజే ఆరోపణలపై మనీ వసూళ్ల కేసులో అనిల్ దేశ్ముఖ్ జైలు పాలయ్యారు. ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కూడా గత మే 30న హవాలా లావాదేవీల నిరోధక చట్టం కింద అరెస్టయ్యారు.
ఇటీవల పశ్చిమ బెంగాల్లో టీచర్ల నియామక స్కామ్లో ఆ రాష్ట్ర మంత్రిగా పని చేసిన పార్థా చటర్జీని ఈడీ అరెస్ట్ చేసింది. పార్థాచటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఇంట్లో రూ.27 కోట్లకు పైగా నగదు, ఐదు కిలోల బంగారం జప్తు చేసింది.
నాలుగేండ్ల క్రితం పెద్ద రాజకీయ నేరాల కేసులు, కుంభకోణాలన్నీ సీబీఐ దర్యాప్తు చేసేది. తర్వాత ఈడీ ఎంటరయ్యేది. పశుగ్రాసం కేసు, స్పెక్ట్రం స్కామ్, కోల్ స్కామ్ వంటి ఉదాహరణలు ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్న ములాయం సింగ్ యాదవ్, మాయావతి, మధుకోడా వంటి మాజీ సీఎంలపైనా సీబీఐ కేసులు నమోదయ్యాయి.
గత 10 ఏండ్లలో విదేశీ మారక ద్రవ్యంకు సంబంధించి ఫెమా చట్టం కింద 24,893 కేసులు నమోదు చేసింది. వాటిల్లో 3985 హవాలా లావాదేవీల కేసులు. 2014-15లో ఫెమా కింద 915 కేసులు రిజిస్టర్ అయితే 2021-22లో 5,313కి పెరిగాయి. పీఎంఎల్ఏ కింద 2014-15లో 178 కేసులు రికార్డయితే 2021-22లో 1180 కేసులు నమోదయ్యాయి. దీని ప్రకారం 2014 నుంచి ఈడీ కేసులు ఐదురెట్లు పెరిగాయి. 2014-15లో 1093 కేసులు రికార్డయితే, 2021-22లో 5,493లకు చేరింది.