హైదరాబాద్, సెప్టెంబర్ 21: మనీలాండరింగ్కు సంబంధించి రాజకీయ నాయకులు, వ్యాపారులు, అధికారుల ఇండ్లు, కార్యాలయాలపై గత 8 ఏండ్లలో ఈడీ 3,010 దాడులు చేసి రూ.లక్ష కోట్ల విలువైన సొత్తును సీజ్ చేసింది. ఈ స్థాయిలో సొమ్మును సీజ్ చేయడం చరిత్రలో మొదటిసారి. ఈ సొమ్ముంతా ప్రభుత్వం ఏం చేయనున్నది? అన్న ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతున్నాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)లోని సెక్షన్ 9 ప్రకారం.. సీజ్ చేసిన సొమ్మునంతా కేసు తేలేవరకూ ఈడీ వ్యక్తిగత పద్దుల ఖాతా ఉన్న ఆర్బీఐ లేదా ఎస్బీఐ బ్రాంచీలో జమ చేయాలి.
నిందితుడి నేరం రుజువైతే, ‘లెక్కలోకి రాని ధనం’ కేంద్రప్రభుత్వ ఖజానాలోకి వెళ్తుంది. అయితే, ఈడీకి ఇటీవల విస్తృత అధికారాలను కల్పిస్తూ తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు.. సోదాల్లో సీజ్ చేసిన సొమ్ము ఈడీ కస్టడీలో ఉంచొచ్చని వెల్లడించింది. దీనిపై ప్రతిపక్షాలతో పాటు, ఆర్థికరంగ నిపుణులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మోదీ సర్కారుకు కోర్టు తీర్పు ఒక చక్కని అవకాశంగా మారే ప్రమాదమున్నదని, జేబు సంస్థగా ఉన్న ఈడీ కస్టడీలోని రూ. లక్ష కోట్ల సొమ్మును ఎన్నికల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఆ పార్టీ వినియోగించినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.