న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరింత దూకుడు పెంచింది. ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తోపాటు ఆప్ పార్టీకి చెందిన ప్రధాన నాయకులను అరెస్టు చేసిన ఈడీ.. తాజాగా ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ (Gulab Singh Yadav) ఇంటిపై దాడిచేసింది. ప్రస్తుతం ఈడీ (ED Raids) అధికారులు ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం అరెస్టయిన కేజ్రీవాల్కు ఢిల్లీ కోర్టు వారం రోజులు కస్టడీ విధించిన విషయం తెలిసిందే.
కాగా, ఈడీ దాడులపై ఆప్ నాయకుడు, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ స్పందించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ప్రతిపక్షాన్నే జైలుకు పంపించాలని కృతనిశ్చయంతో ఉన్నట్లు దేశ ప్రజలకే కాదు మొత్తం ప్రపంచానికి అర్ధమైందని చెప్పారు. ప్రస్తుతం ఈ దేశం రష్యా అడుగు జాడల్లో నడుస్తున్నదని, ఇదే విధంగా బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఉత్తర కొరియాలో కూడా జరిగిందని తెలిపారు. ప్రస్తుతం భారత్లో జరుగుతున్నాయని విమర్శించారు.
ప్రజల ప్రాథమిక హక్కుల హణనంతోపాటు ప్రతిపక్షాలను అంతమొందించడంతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రస్తుతం నియతృత్వంలోకి వెళ్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓ అక్రమ కేసులో తమ పార్టీ చెందిన నలుగురు అగ్రనాయకులు ప్రస్తుతం జైలులో ఉన్నారని చెప్పారు. తాము గుజరాత్లోని పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తున్నామని, ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్రానికి ఇంచార్జ్గా ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్పై ఈడీ దాడులు నిర్వహిస్తున్నదని విమర్శించారు. ఇలాగే మౌనంగా ఉంటే ఆప్తోపాఉ ఇతర ప్రతిపక్ష నాయకులపై ఇలాగే దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పారు.