న్యూఢిల్లీ, జూలై 5: చైనీస్ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వివో, అనుబంధ సంస్థల కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం సోదాలు చేసింది. ఢిల్లీ, యూపీ, మహారాష్ట్రతో సహా దేశవ్యాప్తంగా 44 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది. మనీలాండరింగ్ కేసులో ఈ సోదాలు చేపట్టినట్టు ఈడీ అధికారులు పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్కి చెందిన ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్పై ఢిల్లీ పోలీసులు (ఆర్థిక నేరాల వింగ్) నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.
కంపెనీలోని కొంతమంది చైనా వాటాదారులు తమ గుర్తింపు పత్రాలను ఫోర్జరీ చేశారని అందులో ఆరోపించింది. షెల్ కంపెనీల ద్వారా సమీకరించిన నిధులను విదేశీ ఖాతాలకు అక్రమంగా బదిలీ చేసేందుకు ఫోర్జరీకి పాల్పడ్డారని పేర్కొన్నది. ఈడీ సోదాలపై వివో అధికార ప్రతినిధి స్పందిస్తూ అధికారులకు అన్నివిధాలుగా సహకరిస్తున్నామని, భారతీయ చట్టాలకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్లో మనీలాండరింగ్ కేసులో చైనా స్మార్ట్ఫోన్ కంపెనీ షావోమీ ఇండియాకి చెందిన బ్యాంకు ఖాతాల్లోని రూ.5,551 కోట్లను ఈడీ స్తంభింపచేసింది. అంతకుముందు హువావే కంపెనీపై ఐటీ శాఖ దాడులు చేసింది.