బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ ముఖ్య నేతల్లో ఒకరు, బళ్లారి ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి ఇంటిపై ఈడీ దాడులు చేపట్టింది. కర్ణాటకలోని ఆరు ప్రాంతాల్లో ఏక కాలంలో ఈడీ దాడులు జరిపినట్టు అధికారిక వర్గాలు శనివారం మీడియాకు వెల్లడించాయి. మనీలాండరింగ్ కేసులో ఎమ్మెల్యేపై కర్ణాటక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భరత్రెడ్డి నివాసం, కార్యాలయంతోపాటు కర్ణాటక, తెలంగాణల్లో ఆయన సన్నిహితుల ఇండ్లలోనూ సోదాలు జరుపుతున్నామని అధికారులు చెప్పారు. బళ్లారి, బెంగళూరులలో ఆయన నివాసాల్లో దర్యాప్తు ఏజెన్సీ అధికారులు సోదాలు నిర్వహించారు.
భూ ఒప్పందాలకు సంబంధించి అవకతవకలు జరిగాయన్న ఆరోపణల్లో కర్ణాటక పోలీసులు భరత్రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపైనా, పలు మైనింగ్, క్వారీ సంస్థల వ్యాపారాలతో ఆయనకు సంబంధమున్న ఆరోపణలపైనా ఈడీ విచారణ జరుపుతున్నది. ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు లభ్యమైనట్టు ఈడీ అధికారిక వర్గాలను ఊటంకిస్తూ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.