రాంచీ, జనవరి 20: భూ కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్పై ఈడీ విచారణ మొదలైంది. శనివారం మధ్యాహ్నం సీఎం అధికారిక నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులు కేసుకు సంబంధించి ఆయన్ని కొన్ని గంటలపాటు ప్రశ్నించింది. రాష్ట్ర సీఎం, అధికార పార్టీ ‘జేఎంఎం’కు ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా వున్న హేమంత్ సోరెన్(48)కు ఈడీ 7సార్లు సమన్లు జారీ చేసింది. 8వ సారి పంపిన ఈడీ సమన్లను సీఎం హేమంత్ సోరెన్ అంగీకరించక తప్పలేదు.
దీంతో వెంటనే ఈడీ విచారణకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో శక్తివంతమైన బాడీ కెమరాలను వెంటబెట్టుకొని పదుల సంఖ్యలో ఈడీ అధికారులు ఆయన నివాసానికి చేరుకోవటం, వారికి భద్రతగా పెద్ద ఎత్తున సీఐఎస్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగటం వార్తల్లో నిలిచింది. అంతేగాక సీఆర్పీఎఫ్ బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించారు. ఈనేపథ్యంలో సీఎం నివాసం వద్దకు జేఎంఎం ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఓ వైపు సీఎంను ఈడీ విచారిస్తుండగా, మరోవైపు జేఎంఎం ఎమ్మెల్యేల సమావేశం కావటం చర్చనీయాంశమైంది. సీఎం సోరెన్ను అరెస్టు చేస్తున్నారన్న వార్తలు జేఎంఎం పార్టీ వర్గాల్ని ఆందోళనకు గురిచేశాయి.
తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతున్నదని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆరోపించారు. సుమారు ఏడు గంటల పాటు ఈడీ విచారించిన తర్వాత తన ఇంటి వద్ద పెద్ద సంఖ్యలో హాజరైన అభిమానులు, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘నాకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోంది. మీ నేత ఎన్నడూ భయపడబోడు.’ అని అన్నారు. ఇలాంటి సమయంలో తనకు అండగా ఉన్న వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.